logo

ఒక్క మిస్డ్‌కాల్‌.. రెండు ప్రాణాలు బలి

విద్యా బుద్ధులు నేర్పి సమాజాన్ని చక్కటి మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు తప్పు తోవలో పయణించడంతో రెండు ప్రాణాలు గాలిలో కలిశాయి.

Published : 31 May 2023 05:03 IST

పెళ్లికాని యువతిగా యువకుడితో వివాహిత వాట్సప్‌ చాటింగ్‌
విషయం తెలిసి దూరంగా పెట్టడంతో మహిళ ఆత్మహత్య
ఆందోళనతో యువకుడు బలవన్మరణం

హయత్‌నగర్‌ న్యూస్‌టుడే: విద్యా బుద్ధులు నేర్పి సమాజాన్ని చక్కటి మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు తప్పు తోవలో పయణించడంతో రెండు ప్రాణాలు గాలిలో కలిశాయి. ఆ మహిళ చేసిన మోసం కారణంగా ఆమెతో పాటు మరో యువకుడు బలవన్మరణాలకు పాల్పడ్డారు. రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఈ సంఘటనకు సంబంధించి తెలిసిన వివరాలు..

ములుగు జిల్లా ములుగు పరిధిలోని పంచోత్కులపల్లికి చెందిన ఎల్లావుల పరుశురాములు, విజయ దంపతుల రెండో సంతానమైన రాజేష్‌(25) మృతదేహం నగర శివారులోని హయత్‌నగర్‌ సమీపంలోని కుంట్లూర్‌లో ఈ నెల 29న లభించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పరిశీలించి చూస్తే ఒక్క మిస్డ్‌కాల్‌ రెండు నిండు ప్రాణాలు బలి కావడంతో పాటు ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపినట్లయింది. హైదారాబాద్‌ శివారులోని హయత్‌నగర్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు(45).. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. సుమారు ఏడాదిన్నర క్రితం ఆమె నుంచి రాజేష్‌ సెల్‌ఫోన్‌కు మిస్డ్‌కాల్‌ వచ్చింది. దాంతో ఎవరూ?.. ఏమిటి? అంటూ పరస్పరం వాట్సప్‌ల ద్వారా పలకరించుకోవడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ ఉపాధ్యాయురాలు తనకు వివాహం కాలేదని చెప్పడం.. యువకుడికి కూడా పెళ్లి కాకపోవడంతో ఇద్దరూ చాటింగ్‌లు చేసుకోవడం, చనువు ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. అనంతర కాలంలో వారిద్దరు కలిసి కారులో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరిగారు. కలిసిన ప్రతిసారీ ఆమె వివాహితగా గుర్తించకుండా ఉండేలా జాగ్రత్త పడుతూ వచ్చింది. ఆ క్రమంలో రాజేష్‌ ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలియవచ్చింది. కొద్దిరోజులయ్యాక సదరు ఉపాధ్యాయురాలికి వివాహమై ఉన్నత విద్య చదివే వయసున్న కుమార్తె, ఓ కుమారుడు ఉన్నట్లు రాజేశ్‌కు తెలిసింది. దీంతో అలాంటి మహిళను ఎలా వివాహం చేసుకుంటానని భావించి రెండు నెలలుగా ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. దీన్ని తట్టుకోలేకపోయిన ఆమె.. ‘నువ్వులేకుండా నేను ఉండలేను.. పురుగు మందు తాగి చనిపోతా’ అంటూ పలుమార్లు రాజేష్‌ సెల్‌ఫోన్‌కు వాట్సప్‌ ద్వారా సందేశాలు పంపింది. చెప్పినట్లుగానే ఈ నెల 24న పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా కుటుంబసభ్యులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందింది. 

తల్లి ఆత్మహత్యాయత్నం.. సెల్‌ఫోన్‌ సందేశాలతో విషయం బయటికి

ఈ ఘటన అనంతరం ఉపాధ్యాయురాలి కుమారుడు తన తల్లి సెల్‌ఫోన్‌లోని వాట్సప్‌ చాట్‌లో విషయాలన్ని పరిశీలిస్తే ఆత్మహత్య చేసుకోవడానికి రాజేష్‌ కారణమని నిర్ధారణకు వచ్చాడు. ఎలాగైనా అతడిని గుర్తించాలనే ఉద్దేశంతో స్నేహితుల సాయం కోరాడు. ఉపాధ్యాయురాలి మాదిరిగా యువకుడికి వాట్సప్‌ మెసేజ్‌లు పెడుతూ నమ్మించాడు. ఫలానా దగ్గర కలుస్తామంటూ సందేశం పంపగా రాజేష్‌ హయత్‌నగర్‌ కుంట్లూర్‌ రోడ్డులోని ఓ టీస్టాల్‌ వద్దకు వచ్చి వేచి ఉన్నాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనాలపై వచ్చిన ఉపాధ్యాయురాలి కుమారుడు రాజేష్‌ను డాక్టర్స్‌ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ నీవల్లే మా మమ్మీ ఆత్మహత్యకు యత్నించిందని దాడి చేశాడు. ఇకపై మా అమ్మ జోలికి రావద్దని హెచ్చరించి పంపారు. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన రాజేష్‌ ఆత్మహత్యకు యత్నించాడు. పురుగు మందు తాగిన రాజేష్‌ డాక్టర్స్‌ కాలనీలోని కంపౌండ్‌లోకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటూ అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. రాజేష్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా కొన్ని విషయాలు బహిర్గతమైనట్లు తెలిసింది. శరీర లోపలి భాగాల్లో ఎక్కడా గాయాలైనట్లు, రక్తస్రావమైనట్లు ఆనవాళ్లు కనిపించలేదని సమాచారం. పురుగు మందు తాగిన ఆనవాళ్లు గుర్తించినట్లు ప్రాథమికంగా తెలిసింది. ప్రధాన అవయవాలతో పాటు పొట్టలోని స్రావాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. పోస్టుమార్టం పూర్తైన అనంతరం రాజేష మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం అతడి కుటుంబ సభ్యులకు అప్పగించగా వారు పంచోత్కులపల్లికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని