logo

వేసవి తాపం.. మారిన షిఫ్టు సమయం

ఉపరితల గనుల్లో షిఫ్టు వేళలను సింగరేణి మార్పు చేసింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా యాజమాన్యం ఉదయం, రెండో షిఫ్టు సమయాల్లో మార్పు చేసింది. సాధారణంగా ఉదయం షిఫ్టు 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది.

Published : 06 May 2024 06:08 IST

న్యూస్‌టుడే, భూపాలపల్లి

ఉపరితల గని

ఉపరితల గనుల్లో షిఫ్టు వేళలను సింగరేణి మార్పు చేసింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా యాజమాన్యం ఉదయం, రెండో షిఫ్టు సమయాల్లో మార్పు చేసింది. సాధారణంగా ఉదయం షిఫ్టు 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతోంది. కాగా ఈ సమయాలను ఉదయం 6 నుంచి 12కు, మధ్యాహ్నం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు మార్చారు. దీన్ని యాజమాన్యం సోమవారం నుంచి అమలులోకి తీసుకురానుంది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఉపరితల గనుల్లో పనిచేసే ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు. ముఖ్యంగా ఉదయం, రెండో షిఫ్టు విధులు నిర్వహించే కార్మికులు విధులు నిర్వహించలేమని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి వ్యాప్తంగా 19 ఉపరితల గనుల్లో సుమారు 17 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఆపరేటర్లతో పాటు కేబుల్‌బాయ్‌లు, సాంకేతిక సిబ్బంది ఉపరితల గని క్వారీల్లో పనిచేయాల్సి ఉండటంతో ఎండ వేడికి అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. పట్టణంలో రోజూ 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉపరితల గని క్వారీల్లో ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉద్యోగులు ఈ గనుల్లో పనిచేసేందుకు దూరంగా ఉంటున్నారు. కాగా బొగ్గు ఉత్పత్తిపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉంది.

కార్మికుల్లో అసంతృప్తి : షిఫ్టు వేళలు మార్చినా మార్చినా పని గంటలు మాత్రం యథావిధిగా ఉన్నాయని కార్మికుల్లో అసంతృప్తి నెలకొంది. సాధారణంగా ప్రతి షిఫ్టునకు 8 గంటల పని దినం కింద లెక్కిస్తారు. ప్రస్తుతం యాజమాన్యం పని సమయాలు మార్పు చేసినా.. 8 గంటల పనిలో ఎలాంటి మార్పు చేయలేదు. ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సమయం కేటాయిస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు విధుల్లోకి చేరిన తర్వాత మధ్యలో గంట విరామం ఉంటుంది. భోజన సమయం కింద గంట పాటు విశ్రాంతి ఇస్తారు. ఈ సమయాన్ని భోజనానికి వినియోగించకుండా విధుల్లో చేరింది మొదలు విరామం లేకుండా పని చేస్తామని ఉద్యోగులు వెల్లడిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని