logo

రూ.కోటి ఎర్రచందనం స్వాధీనం

రూ.కోటి ఎర్రచందనం స్వాధీనం చేసుకుని అయిదుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు చంద్రగిరి డీఎస్పీ డాక్టర్‌ యశ్వంత్‌ తెలిపారు.

Published : 07 Jun 2023 02:33 IST

అయిదుగురు స్మగ్లర్ల అరెస్టు

నిందితులను అరెస్టు చూపుతున్న పోలీసులు

చంద్రగిరి, న్యూస్‌టుడే: రూ.కోటి ఎర్రచందనం స్వాధీనం చేసుకుని అయిదుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు చంద్రగిరి డీఎస్పీ డాక్టర్‌ యశ్వంత్‌ తెలిపారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయ ఆవరణలో నిందితులను అరెస్టు చూపి మీడియాకు వివరాలు వెల్లడించారు. ‘పెద్దఎత్తున ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న రహస్య సమాచారంతో భాకరాపేట సీఐ తులసీరాం, ఎర్రావారిపాళెం ఎస్సై వెంకటేశ్వరులు, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించాం. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం తరలిస్తున్న స్మగర్లను పట్టుకున్నాం. వారి నుంచి 72 ఎర్రచందనం రీఫర్లు, నాలుగు బస్తాల ఎర్రచందనం పొడి చెక్కలు, ఎనిమిది బ్యాగుల ఎర్రచందనం రంపపు పొడి, లారీ, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నాం. స్మగ్లర్లు తమిళనాడుకు చెందిన మహ్మద్‌రసూల్‌, కార్తీక్‌, భాస్కరన్‌ జేసురాజ్‌, అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం సిద్దారెడ్డిగారిపల్లెకు చెందిన తిరుమలశెట్టి నాగరాజ, అమరేంద్రరాజుగా గుర్తించాం. రసూల్‌పై 25 కేసులున్నాయి. పీడీ యాక్ట్‌లో జైలు శిక్ష అనుభవించాడు. స్మగ్లింగ్‌ కేసులో దిల్లీకి చెందిన ఇరువురు ప్రధాన నిందితులను గుర్తించాం. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందం అన్వేషిస్తోంది. నిందితులపై పీడీ యాక్టు నమోదు చేస్తాం. స్మగ్లింగ్‌కు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ఎర్రచందనం దుంగలను చిన్నచిన్న ముక్కలుగా చేసి మూటలు కడుతున్నారు. దుంగలను రీఫర్లుగా యంత్రాలతో కోస్తున్నారు. రంపపు పొడిని సైతం బస్తాల్లో నింపి రవాణా చేస్తున్నారు’ అని డీఎస్పీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని