Tollywood: ఏపీలో సినిమా టికెట్‌ రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేసిన హైకోర్టు

సినిమా టికెట్‌ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.

Published : 15 Dec 2021 01:31 IST

అమరావతి: సినిమా టికెట్‌ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh) ప్రభుత్వానికి హైకోర్టు(AP High court)లో ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవో నెం.35ను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. పాత విధానంలో టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. టికెట్‌ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ థియేటర్‌ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిందని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని, కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్‌ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్‌ యజమానులకు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. సీనియర్‌ న్యాయవాదులు ఆదినారాయణ రావు, దుర్గా ప్రసాద్‌ పిటిషనర్ల తరపున వాదనలు వినిపించారు. టికెట్‌ రేట్లు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారుజ పిటిషనర్‌ తరపు న్యాయవాదులు చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. దీంతో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.35ను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

టికెట్‌ రేట్లను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో జీవో నెం.35ను తీసుకొచ్చింది. ఈ నిర్ణయంపై సినిమా వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. జీవో విషయంలో పునరాలోచించాలని సినీ పరిశ్రమకు చెందిన పలువురు పెద్దలు ప్రభుత్వాన్ని కోరారు. వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పేర్ని నానిని కలిసి తమ పరిస్థితి వివరించారు. అయితే, ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగు వేయలేదు. తమకు ఏ సినిమా అయినా ఒకటేనని, పెద్ద సినిమాలు విడుదలైన సమయంలో టికెట్‌ రేట్లు భారీగా పెంచేస్తున్నారని, దాన్ని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. టికెట్‌ రేట్ల తగ్గింపు విషయమై సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా విమర్శించారు. పారదర్శకత కోసం టికెట్లను ఆన్‌లైన్‌ చేసిన ప్రభుత్వం మద్యం అమ్మకాలను కూడా చేయాలని డిమాండ్‌ చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు. మరోవైపు చిరంజీవి వంటి అగ్ర హీరోలు సైతం టికెట్‌ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పలు వేదికలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ నేపథ్యంలో థియేటర్‌ యజమానులు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పుపై ప్రభుత్వ స్పందన వెలువడాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు