Andhra News: ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఉన్నత, ప్రాథమిక  పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల నియామకం కోసం బదిలీల ప్రక్రియ చేపట్టనుంది.

Updated : 10 Dec 2022 16:21 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల నియామకం కోసం బదిలీల ప్రక్రియ చేపట్టనుంది. 3-10 తరగతులకు 7,928 సబ్జెక్టు టీచర్లు అదనంగా అవసరమని విద్యాశాఖ అంచనా వేస్తోంది. ఇందుకోసం హెడ్‌మాస్టర్‌ గ్రేడ్-2 సహా టీజీటీల బదిలీల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. మరోవైపు బదిలీల ప్రక్రియ కారణంగా 2022-23 విద్యా సంవత్సరం ఒడిదొడుకులకు లోనుకాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది.

డిసెంబరు 12 నుంచి జనవరి 12వ తేదీ వరకూ నెలరోజుల పాటు ఈ బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. జెడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లోని గ్రేడ్-2 హెడ్‌ మాస్టర్‌ల సర్వీసు కనీసం 5ఏళ్లు ఉండాలని ప్రభుత్వం నిబంధనల్లో పేర్కొంది. ఉపాధ్యాయుల బదిలీలకు సర్వీసుతో సంబంధం లేదని ప్రభుత్వం వెల్లడించింది. బదిలీల ప్రక్రియను ఆన్‌లైన్ దరఖాస్తు, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని