Sundar Naidu Uppalapati: ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు కన్నుమూత

బాలాజీ హేచరీస్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. పశు వైద్యుడిగా వృత్తిని ప్రారంభించిన ఆయన..

Updated : 28 Apr 2022 20:19 IST

హైదరాబాద్‌: బాలాజీ హేచరీస్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు(85) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. పశు వైద్యుడిగా వృత్తిని ప్రారంభించిన ఆయన.. కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి అపార కృషి చేశారు. ఉమ్మడి ఏపీలో తొలితరం పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. ఏపీ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. చిత్తూరులో బాలాజీ హేచరీస్‌ స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఔత్సాహికులకు దార్శనికుడిగా నిలిచారు.

ఉప్పలపాటి సుందరనాయుడు(Sundar Naidu Uppalapati) 1936 జులై 1న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కంపలపల్లెలో జన్మించారు. నాన్న గోవిందునాయుడు, అమ్మ మంగమ్మలకు సుందరనాయుడుతో కలిపి మొత్తం ఐదుగురు సంతానం. వీరిది ఉమ్మడి కుటుంబం. మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుందరనాయుడు టి.పుత్తూరు పాఠశాలలో ప్రాథమిక విద్య, అరగొండ జడ్పీ హైస్కూల్‌లో ఉన్నత పాఠశాల విద్య, తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత బొంబాయి వెటర్నరీ యూనివర్సిటీలో బీవీఎస్సీ పూర్తి చేశారు. చదువులో చురుగ్గా ఉండే సుందరనాయుడు.. తన గ్రామంలోని యువతను చైతన్య పరచడానికి నేతాజీ బాలానంద సంఘాన్ని స్థాపించి, గ్రంథాలయాన్ని, క్రీడా పరికరాలను సమకూర్చారు. గ్రామస్థుల సహకారంతో సంఘానికి శాశ్వత భవనాన్ని నిర్మించారు. విద్యార్థి దశ నుంచే సమాజ సేవా దృక్పథం, సమైక్య భావన సుందరనాయుడికి అలవడింది.

పశువైద్యుడిగా జీవితం ప్రారంభించి..

బీవీఎస్సీ పూర్తయిన తర్వాత కొంతకాలం చిత్తూరు జిల్లా పీలేరులో పశు వైద్యుడిగా ప్రభుత్వ ఉద్యోగం చేశారు. 1964 డిసెంబర్ 9న సుందరనాయుడికి పెమ్మసాని సుజీవనతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు.. శైలజ, నీరజ. శైలజా కిరణ్‌ రామోజీగ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పెద్ద కోడలు. మార్గదర్శి చిట్ ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి ఎండీ.

ఉద్యోగానికి రాజీనామా చేసి..

పశువైద్యుడిగా పేరొందిన సుందరనాయుడు చిత్తూరు, అనంతపురం, కృష్ణగిరి(తమిళనాడు)జిల్లాల్లో విశేష సేవలందించారు. ఈ క్రమంలోనే అక్కడి రైతులకు దగ్గరయ్యారు. రైతుల జీవితాలను దగ్గరి నుంచి చూసిన ఆయనకు పెద్ద సమస్యే కనిపించింది. పంటలు పండక, పండినా గిట్టుబాటు ధర రాక రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశారు. వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం ఉంటే రైతుల సమస్యలు తగ్గుతాయని భావించారు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే కోళ్ల పెంపకం. పరిశ్రమ ప్రారంభిస్తే ఎంతో మందికి ఉపాధి కల్పించ వచ్చనే కోరిక క్రమంగా బలపడటంతో, కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సంప్రదించిన తర్వాత సుందర నాయుడు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1967లో కోళ్ల పరిశ్రమ స్థాపనకు నాంది పలికారు. కోళ్ల ఫారాల గురించి ఎంతో మంది రైతులకు అవగాహన కల్పించారు. స్వయంగా కాలినడకన అనేక ఊళ్లు తిరిగారు. కోళ్లకు వైద్యం సహాయం అందిస్తానని భరోసా ఇవ్వడంతో రైతులు సైతం కోళ్ల ఫారాలు పెట్టేందుకు ముందుకు వచ్చారు.  సుందరనాయుడిపై నమ్మకంతో ఇటువైపు వచ్చిన రైతులకు సరికొత్త ఉపాధి దొరికింది. పదుల సంఖ్యలో ప్రారంభమైన కోళ్ల ఫారాలు మూడేళ్లు తిరిగే సరికి వందల సంఖ్యకు చేరింది. కోళ్ల ఫారాలు ప్రారంభించినప్పటికీ కోడి పిల్లల దిగుమతి సమస్యగా మారింది. ఆ కొరతను తీర్చడానికి సుందరనాయుడు మరో అడుగు ముందుకు వేశారు. 1972లో ‘బాలాజీ హేచరీస్‌’ స్థాపించి పౌల్ట్రీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు.

దేశంలోనే అతిపెద్ద వీఎస్‌ఎన్ ఫీడ్స్‌ను స్థాపించి...

పౌల్ట్రీ రంగం పుంజుకుంటోందన్న తరుణంలో కోళ్ల దాణాకు తీవ్ర కొరత ఏర్పడింది. మొక్క జొన్న, సోయా, వేరుసెనగ చెక్క, తవుడు, వంటివి దొరికేవి కావు. పట్టణాల్లోని వ్యాపారుల సాయంతో అన్ని సరకుల్నీ సేకరించే వారు. అప్పట్లో ఎగుమతులు ఎక్కువగా ఉండేవి. ఈసమస్య పరిష్కారానికి కోళ్ల రైతుల సమాఖ్య ఆధ్వర్యంలో కేంద్ర వాణిజ్య, వ్యవసాయశాఖ మంత్రులను  కలిసి.. దేశీయ అవసరాలకు అనుగుణంగా నిల్వ ఉంచి, మిగిలిన దాన్ని ఎగుమతి చేసేలా ఒప్పించారు. 1989లో దేశంలోనే అతి పెద్దదైన ‘వీఎస్‌ఎన్‌ ఫీడ్స్‌’ను స్థాపించి దాణా కొరతను కొంత వరకు తీర్చగలిగారు. 2006లో ‘వీఎస్‌ఎన్‌ చికెన్‌ సెంటర్స్‌’ను కూడా ఏర్పాటు చేశారు. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో సుమారు 50 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాణ్యమైన, తక్కువ కొవ్వు ఉండే చికెన్‌ను తక్కువ ధరకే వినియోగదారులకు అందించడమే వీటి లక్ష్యం. 2005, 2006లో దేశీయ పౌల్ట్రీ రంగం దాదాపుగా కుదేలైంది. మహారాష్ట్ర, అసోంలలో వచ్చిన బర్డ్‌ఫ్లూ దేశంలోని పౌల్ట్రీ రంగాన్ని చావు దెబ్బకొట్టింది. ఆసమయంలో రైతుల దీనావస్థ చూసి చలించిపోయిన సుందరనాయుడు... నష్ట నివారణ చర్యలు చేపట్టారు. నెక్‌, బ్రోమార్క్ తరఫున రాష్ట్రమంతా తిరిగి సమావేశాలు ఏర్పాటు చేశారు. క్రమంగా ప్రజల్లో అవగాహన పెరగడంతో అమ్మకాలు పుంజుకున్నాయి.

ఎన్నో గౌరవాలు..

పౌల్ట్రీ రంగానికి సుందరనాయుడు చేసిన కృషిగానూ అనేక అరుదైన గౌరవాలు అందుకున్నారు. పుణెలోని డాక్టర్‌ బీవీరావు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపక ట్రస్ట్రీగా వ్యవహరించారు. ‘నెక్‌’ జీవిత కాల ఆహ్వాన సభ్యుడిగా, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్‌ శాశ్వత ఆహ్వాన సభ్యుడిగా, అంతర్జాతీయ పౌల్ట్రీ సైన్స్‌ అసోసియేషన్‌ సభ్యుడిగా, ఎగ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగానూ విశేష సేవలందించారు. అంతేకాదు, న్యూజెర్సీ ప్రభుత్వం ‘డూయర్‌ ఆఫ్‌ ద పౌల్ట్రీ ఇన్‌ సౌత్‌ ఇండియా’ అవార్డుతో సుందరనాయుడిని సత్కరించింది.

ఆయన జీవితం భావితరాలకు ఆదర్శనీయం: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

బాలాజీ హేచరీస్‌ అధినేత సుందరనాయుడు మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. రాష్ట్రంలో తొలితరం పారిశ్రామికవేత్తల్లో సుందరనాయుడు ఒకరన్నారు. వ్యక్తిగతంగా తనకు అత్యంత ఆత్మీయులని పేర్కొన్నారు. కోళ్ల పరిశ్రమవైపు ఎంతో మందిని ప్రోత్సహించారని తెలిపారు. పనిపట్ల అంకితభావం ఆయన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టిందన్నారు. ఉన్నత స్థాయికి చేరినా నిరాడంబరంగా జీవించారని వెల్లడించారు. సుందరనాయుడు జీవితం భావితరాలకు ఆదర్శనీయమని వెంకయ్యనాయడు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని