Ys Sharmila: వైఎస్‌ షర్మిలపై కేసు.. తీర్పు రిజర్వ్‌ చేసిన న్యాయస్థానం

విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్నందుకు గానూ వైతెపా అధ్యక్షురాలు షర్మిలపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 24 Apr 2023 19:54 IST

హైదరాబాద్‌: విధినిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న వైతెపా అధ్యక్షురాలు షర్మిలతో సహా మరో ఇద్దరిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏ1 గా వైఎస్ షర్మిల, ఎ2గా కారు డ్రైవర్ బాలు , ఏ3 గా మరో డ్రైవర్ జాకబ్‌ల పేర్లు నమోదు చేశారు.  బాలును అరెస్టు చేయగా.. మరో డ్రైవర్ జాకబ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సిట్‌ కార్యాలయాన్ని ముట్టడించిన తర్వాత  ‘టీ సేవ్‌’ నిరాహార దీక్షలో భాగంగా.. ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కోరాలని వైఎస్‌ షర్మిల నిర్ణయించారు. ఈ నేపథ్యంలో  ఇవాళ ఉదయం ఇంటి నుంచి షర్మిల బయలుదేరుతుండగా.. పోలీసులు భారీ ఎత్తున మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో పోలీసులు, ఆమెకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన పనుల మీద బయటకు వెళ్తుంటే ఎందుకు అడ్డకుంటున్నారంటూ ఆమె పోలీసులను ప్రశ్నించారు. బయటకు వెళ్తుండగా అడ్డుకున్న బంజారాహిల్స్‌ ఎస్సై రవీందర్‌తోపాటు.. మహిళా కానిస్టేబుల్‌పై షర్మిల చేయి చేసుకున్నారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. షర్మిల చేయి చేసుకున్న ఇద్దరు పోలీసులు.. బంజారాహిల్స్‌ పీఎస్‌లో పని చేస్తుండటంతో.. అక్కడే కేసు నమోదు చేశారు. మరోవైపు షర్మిల అరెస్టు విషయం తెలుసుకున్న ఆమె తల్లి విజయమ్మ.. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆమె కూడా అక్కడున్న పోలీసులపై చేయి చేసుకున్నారు. దీంతో ఆమెకు నచ్చజెప్పిన పోలీసు అధికారులు అక్కడి నుంచి పంపించి వేశారు.

తీర్పు రిజర్వ్‌ చేసిన నాంపల్లి కోర్టు

వైఎస్‌ షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలూ పని చేస్తారని,  అలాంటి వారిపై చేయి చేసుకోవడం వల్ల సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని అన్నారు. షర్మిల తన కారు డ్రైవర్‌ను వేగంగా పోనివ్వాలని చెప్పారని, ఈ క్రమంలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌కు కాలికి గాయాలయ్యాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరో మహిళా కానిస్టేబుల్‌తోపాటు, ఎస్సై పైనా షర్మిల చేయి చేసుకున్నారని కోర్టుకు వివరించారు.

షర్మిల తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అడ్డుకున్నారని అన్నారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. షర్మిలను పోలీసులు బయటకి అనుమతించడం లేదని,పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపారు.  ఓ ఎస్సై తనను చేతితో తాకే ప్రయత్నం చేశారని షర్మిల కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘చాలా మంది పోలీసులు తనను అడ్డుకొని చేయి విరిచే ప్రయత్నం చేశారు. నన్ను కొట్టారు. ఈ క్రమంలో నేను వాళ్లను తోసేశాను’ అని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని