YSRCP: గిడ్డంగుల్లో వైకాపా తాయిలాలు.. నలుగురిపై కేసు నమోదు

సార్వత్రిక ఎన్నికల వేళ తిరుపతి జిల్లా రేణిగుంట గిడ్డంగుల్లో వైకాపా తాయిలాలు దొరికిన ఘటనపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు.

Published : 30 Mar 2024 20:23 IST

తిరుపతి: సార్వత్రిక ఎన్నికల వేళ తిరుపతి జిల్లా రేణిగుంటలో వైకాపా తాయిలాలు దొరికిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేశారు. గిడ్డంగి ఇన్‌ఛార్జ్‌, సెక్యూరిటీ గార్డు సహా నలుగురిపై కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో వైకాపా నేతల పేర్లను మాత్రం పోలీసులు చేర్చలేదు.

ఏం జరిగిందంటే..?

ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తాయిలాలు పంపిణీ చేస్తోన్న వైకాపా శ్రేణులు అందుకు తిరుపతి జిల్లా రేణిగుంటను కేంద్రంగా ఎంచుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే, ఒంగోలు వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి కుటుంబానికి చెందిన గోదాం నుంచి సామగ్రిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు తరలించగా.. మంగళవారం (మార్చి 26న) మిగిలినవాటిని తీసుకెళ్లే క్రమంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి సలోనికి సమాచారం అందింది. వాటిని తీసుకెళ్తున్న లారీని ఆమె తన బృందంతో వచ్చి పట్టుకున్నారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న గోదాంలో భారీఎత్తున సామగ్రితోపాటు డబ్బులు ఉంచినట్లు తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి నరసింహయాదవ్‌తో పాటు కార్యకర్తలు ఆరోపించారు. వెంటనే గోదాం తెరవాల్సిందిగా డిమాండ్‌ చేశారు. పంచనామా నిర్వహించేందుకు అధికారులు రేణిగుంట తహసీల్దారుకు సమాచారమిచ్చినా.. అయిదు గంటల తరువాత ఆయన అక్కడికి చేరుకున్నారు. ఎట్టకేలకు రాత్రి 8 గంటల సమయంలో గోదాం తెరిచారు.

గోదాంలో మొత్తం వివిధ వస్తువులను అధికారులు గుర్తించారు. ఓటర్లకు పంచేందుకు బొట్టు బిళ్లలు, ఫొటో కీచైన్లు, చేతి గడియారాలు, సెల్‌ఫోన్‌ స్టాండ్లు, టీషర్టులు, గొడుగులు, చీరలు, మైక్‌సెట్లు వంటివి ఉన్నాయి. వీటితోపాటు సీఎం జగన్‌, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డిల ఫొటోలున్న సంచులు పెద్దసంఖ్యలో ఉన్నాయి. కొంతమేర వైకాపా ఎన్నికల ప్రచార సామగ్రి కూడా లభించింది. ఏ నియోజకవర్గానికి ఏయే తేదీల్లో తాయిలాలు పంపించారనే వివరాలు ఒక పుస్తకంలో నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు తాజాగా నలుగురిపై కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు