అమ్మమ్మ షరతు.. బతికొచ్చిన బాలుడు

బతికుండగానే ఆ బాలుడు మృతిచెందినట్లు ధ్రువీకరించారు దిల్లీ వైద్యులు. దీంతో తమ ఏడేళ్ల కుమారుడి అంత్యక్రియలకు సిద్ధమయ్యారు ఆ తల్లిదండ్రులు. అయితే అంత్యక్రియలు ఆలస్యం కావడంతో అతడి ప్రాణాలు దక్కాయి

Updated : 18 Jun 2021 20:39 IST

చండీగఢ్‌: బతికుండగానే ఆ బాలుడు మృతిచెందినట్లు ధ్రువీకరించారు దిల్లీ వైద్యులు. దీంతో తమ ఏడేళ్ల కుమారుడి అంత్యక్రియలకు సిద్ధమయ్యారు ఆ తల్లిదండ్రులు. అయితే అంత్యక్రియలు ఆలస్యం కావడంతో అతడి ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన హరియాణాలోని జజ్జర్ జిల్లాలో వెలుగుచూసింది. కిలా ప్రాంతానికి చెందిన విజయ్ శర్మ మనవడు కునాల్ శర్మ టైఫాయిడ్‌తో దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. కొద్దిరోజుల చికిత్స అనంతరం ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో పుట్టెడు దుఃఖంలో తల్లిదండ్రులు కుమారుడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. బహదూర్‌గంజ్​లోని బాలుడి మామ ఇంటి సమీపంలో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.

అయితే వేరే ప్రాంతంలో ఉంటున్న బాలుడి అమ్మమ్మ.. తన మనవడిని కడసారి చూడాలని పట్టుబట్టింది. తాను వచ్చేవరకు అంత్యక్రియలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. అందరూ ఆమె రాకకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తల్లి ఏడుస్తూ బాలుడి శవపేటికను తాకింది. కాగా ఆ శవపేటికలో కదలికలు గుర్తించిన తల్లి విషయాన్ని బాలుడి తండ్రి హితేష్​కు చెప్పింది. శవపేటిక నుంచి కొడుకును​ బయటకు తీసిన తండ్రి.. నోటి ద్వారా శ్వాస అందించడం ప్రారంభించాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి గుండెమీద గట్టిగా అదుముతూ ప్రాథమిక చికిత్స అందించాడు. అనంతరం వెంటనే బాలుడిని రోహ్‌తక్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. 

తొలుత కునాల్‌ శర్మ బతికేందుకు 15 శాతం మాత్రమే అవకాశాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. కాగా క్రమంగా బాలుడు కోలుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ఈ మృత్యుంజయుడు. అమ్మమ్మ షరతుతో అంత్యక్రియలు ఆలస్యం కావడం.. ఈ క్రమంలో అనూహ్య రీతిలో ఆ పిల్లవాడిలో కదలికలు రావడం.. అతడు బతికి బయటపడటంతో ఆ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని