PRC: ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఏపీ ప్రభుత్వం అంగీకారం

బుధవారం కేబినెట్‌ సమావేశం తర్వాత పీఆర్సీపై నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

Updated : 05 Jun 2023 22:31 IST

అమరావతి:  2014 జూన్‌ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు బుధవారం నిర్వహించనున్న కేబినెట్‌ భేటీలో ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయంలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ అధికారులు భేటీ అయ్యారు. ఏపీ రెవెన్యూ, సచివాలయ ఉద్యోగుల సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీవో ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నేతలు భేటీకి హాజరయ్యారు.

12వ వేతన సవరణ సంఘంపైనా ఉద్యోగ సంఘాలతో చర్చించారు. కేబినెట్‌ సమావేశంలోనే దీనిపైన కూడా ప్రకటన విడుదల చేయనున్నారు. మరోవైపు పీఆర్సీ ఛైర్మన్‌గా మాజీ సీఎస్‌ సమీర్‌శర్మ పేరును ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, దీనిని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. ‘‘ కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటుపై కేబినెట్‌ భేటీలో నిర్ణయిస్తాం. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. జనవరి నెలలో ఉత్తర్వులు జారీ చేస్తాం. డీఏ, పీఆర్సీ బకాయిలను రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని చెప్పినా.. ఉద్యోగులు అంగీకరించ లేదు. అందువల్ల 4 ఏళ్లలో 16 వాయిదాల్లో చెల్లిస్తాం. ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు అంశం కోర్టుల్లో ఉంది. గురుకులాల్లో, వర్సిటీల్లో బోధనేతర సిబ్బంది పదవీవిరమణ వయస్సుపై పాజిటివ్‌ నిర్ణయం తీసుకుంటాం. జీపీఎస్‌లోనే మెరుగైన అంశాలు చేర్చి అమలు చేస్తాం.’’ అని భేటీ అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వివరించారు.

సీపీఎస్‌ రద్దు చేయాలని స్పష్టంగా చెప్పాం: బొప్పరాజు

సీపీఎస్‌ రద్దు చేయాలని స్పష్టంగా చెప్పామని ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరులు తెలిపారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల పెంపుపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించిందన్నారు. ‘‘ మా డిమాండ్లను ప్రభుత్వం చాలా వరకు నెరవేర్చింది. పీఆర్సీ, డీఏ బకాయిలు మొత్తంగా రూ.7వేల కోట్లు ఉండొచ్చు. వాటిని నాలుగేళ్లపాటు విడతల వారీగా చెల్లించేందుకు అంగీకరించారు. రాష్ట్ర విభజన నాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సుమారు 7 నుంచి 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు మంత్రుల కమిటీ అంగీకరించింది. ఉద్యమం కొనసాగింపుపై ఈ నెల 8న నిర్ణయం తీసుకుంటాం.’’ అని బొప్పరాజు అన్నారు.

ఓపీఎస్‌ మాత్రమే కావాలన్నాం: బండి శ్రీనివాస్‌

జీపీఎస్‌ కింద కొన్ని రాయితీలు ఇస్తామని చెప్పారని, కానీ, మేమంతా ఓపీఎస్‌ మాత్రమే కావాలని అడిగినట్లు ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ అన్నారు. పీఆర్సీ బకాయిలను నాలుగేళ్లలో చెల్లిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నట్లు చెప్పారు. 

జీపీఎస్‌ పదమే రాలేదు: వెంకట్రామిరెడ్డి

మంత్రుల నోటి నుంచి జీపీఎస్‌ అనే పదమే రాలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో 10 వేల మంది ఒప్పంద ఉద్యోగులక లబ్ధి చేకూరుతుందని చెప్పారు. 12వ పీఆర్సీ ఛైర్మన్‌గా ఎవరి పేరు ప్రతిపాదనకు రాలేదని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని