లాక్‌డౌన్‌ 4.0: ఆంక్షలు, సడలింపులు ఇవీ!

లాక్‌డౌన్‌ 4.0లో సడలింపులు, సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయని సమాచారం. రైల్వే, దేశీయ విమాన ప్రయాణాలు దశల వారీగా ఆరంభమవుతాయని తెలుస్తోంది. కరోనా హాట్‌స్పాట్లను నిర్ణయించే అధికారాన్ని  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం బదిలీ చేయనుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు అంటున్నారు...

Published : 16 May 2020 01:58 IST

మెట్రో, లోకల్‌ రైళ్లు, దేశీయ విమాన  ప్రయాణాలకు అనుమతి

రాష్ట్రాలకు జోన్ల నిర్ణయాధికారం

రెడ్‌ జోన్లలోనూ ఎక్కువ సడలింపులు

దిల్లీ: లాక్‌డౌన్‌ 4.0లో సడలింపులు, సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయని సమాచారం. రైల్వే, దేశీయ విమాన ప్రయాణాలు దశల వారీగా ఆరంభమవుతాయని తెలుస్తోంది. కరోనా హాట్‌స్పాట్లను నిర్ణయించే అధికారాన్ని  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం బదిలీ చేయనుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు అంటున్నారు.

దేశంలో ఎక్కడా కళాశాలలు, పాఠశాలలు, మాల్స్‌, సినిమా థియేటర్లకు అనుమతి ఉండదు. కొవిడ్‌-19 కంటెయిన్‌మెంట్‌ జోన్లను మినహాయించి రెడ్‌జోన్లలో క్షౌరశాలలు, సెలూన్లు, కళ్లద్దాల దుకాణాలకు అనుమతినిస్తారు. గ్రీన్‌ జోన్లలో పూర్తి కార్యకలాపాల్ని ఆరంభించొచ్చు. ఆరెంజ్‌ జోన్లలో మాత్రం పరిమిత ఆంక్షలు ఉంటాయి. రెడ్‌జోన్‌, కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో కఠిన నిబంధనలు కొనసాగుతాయి.

రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు పంపించాక పూర్తి మార్గదర్శకాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేయనుంది. శుక్రవారం లోపు రాష్ట్రాలు సూచనలు ఇవ్వాల్సి ఉంది. పంజాబ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌, మహారాష్ట్ర, అస్సాం, తెలంగాణ లాక్‌డౌన్‌ కొనసాగించాలని కోరుతున్నాయని అధికారులు తెలిపారు. కొవిడ్‌-19 పరిస్థితుల ఆధారంగా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జిల్లాలను నిర్ణయించే అధికారం ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా ప్రజల కదలికలకు అనుమతి, నిరాకరణ అధికారాల్ని రాష్ట్రాలకు బదిలీ చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని సమాచారం.

ఏ రాష్ట్రమూ పూర్తి లాక్‌డౌన్‌కు సుముఖంగా లేదని అయితే దశలవారీగా ఆర్థిక కార్యకలాపాల్ని పునరుద్ధించాలని కోరుకుంటున్నాయని అధికారులు తెలిపారు. రైల్వే, దేశీయ విమాన ప్రయాణాలకు పరిమితంగా అనుమతిస్తారని పేర్కొన్నారు. మే చివరి వరకు ఈ సేవలను పూర్తిగా పునరుద్ధరించేందుకు బిహార్‌, తమిళనాడు, కర్ణాటక ఇష్టపడటం లేదని వెల్లడించారు. కట్టడి ప్రాంతాలను మినహాయించి, కఠిన ఆంక్షల మధ్య పరిమిత సామర్థ్యంలో మెట్రో, స్థానిక రైళ్లను అనుమతినిస్తారని తెలుస్తోంది. ఆంక్షల మేరకు రెడ్‌జోన్లలో ఆటో, రిక్షాలకు అనుమతి ఇస్తారని అంచనా వేస్తున్నారు.

కంటెయిన్‌మెంట్‌ జోన్లు లేని ప్రాంతాల్లో చాలా సేవలకు అనుమతినిస్తారని అయితే రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రెడ్‌ జోన్లలో మార్కెట్లను తెరిచే అధికారాలు సైతం రాష్ట్రాలకే ఇస్తారని తెలిసింది. అత్యవసరం కాని వస్తువులు విక్రయించే దుకాణాలు తెరిచేందుకు సరి-బేసి విధానం అమలు చేయొచ్చన్నారు. ఈ-కామర్స్‌ సంస్థలు డెలివరీ చేసేందుకు పూర్తిగా అనుమతిస్తారని తెలిసింది.

వైరస్‌ ముప్పుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర.. ముంబయి, పుణె, ఇతర పట్టణాల్లో లాక్‌డౌన్‌ కొనసాగింపునకు సుముఖంగా ఉండగా పట్టణ ప్రాంతాలను మినహాయించి మిగతా చోట్ల ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించాలని గుజరాత్‌ భావిస్తోంది. దిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, కేరళ సైతం ఇందుకు మొగ్గు చూపుతున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లు, పర్యాటకాన్ని తెరిచేందుకు కేరళ సిద్ధంగా ఉందని సమాచారం. వలస కార్మికులు రావడంతో బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా లాక్‌డౌన్‌, కఠిన ఆంక్షలకే మొగ్గు చూపుతున్నాయి.

ఇవీ చదవండి
జాగ్రత్త:భారత్‌లో సమూహ వ్యాప్తి ముప్పు?
కోతులపై సక్సెస్‌: ఆశాజనకంగా వ్యాక్సిన్‌ ఫలితాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని