KTR: ఏపీలో పరిస్థితులపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

దేశంలో వ్యవసాయం తర్వాత ఆ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది నిర్మాణ రంగమేనని..

Updated : 29 Apr 2022 17:14 IST

హైదరాబాద్‌: దేశంలో వ్యవసాయం తర్వాత ఆ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది నిర్మాణ రంగమేనని.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆన్నారు. క్రెడాయ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తన దక్షత, సమర్థతతో రాష్ట్రంలో 6నెలల్లో విద్యుత్‌ కొరతను తీర్చారన్నారు. గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

హైదరాబాద్‌కు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఉపాధి పొందుతున్నారని.. కానీ ఇక్కడి యువత మాత్రం గల్ఫ్‌కు వలస పోతున్నారని కేటీఆర్‌ అన్నారు. చేసే పనిలో తేడా లేకపోయినా కుటుంబాలకు దూరంగా వెళ్తున్నారని.. లోపం ఎక్కడుందని ప్రశ్నించారు. నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, సిరిసిల్ల తదితర ప్రాంతాల నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్నారని.. ఇక్కడే ఉపాధి కల్పించేలా చొరవ తీసుకోవాలని క్రెడాయ్‌ ప్రతినిధులకు కేటీఆర్‌ సూచించారు. కార్మికులకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ అందించేందుకు ముందుకొస్తే ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఒక ప్రయత్నం చేద్దామని.. సక్సెస్‌ అయితే దాన్ని కొనసాగిద్దామన్నారు. క్రెడాయ్‌ హైదరాబాద్‌ పరిధిలో తొలుత దాన్ని ప్రారంభించాలని.. ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు దాన్ని విస్తరించాలని కోరారు.

అక్కడికి వెళ్లి చూసొస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారు

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ పరోక్షంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని పరిస్థితిపై మిత్రులు చెప్పిన మాటలను ఆయన ప్రస్తావించారు. ‘‘పక్క రాష్ట్రంలో కరెంట్‌, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారు. అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు.. పక్క రాష్ట్రం వెళ్లి మీరే చూడండి. అక్కడికి వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారు. కొన్ని మాటలంటే కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ.. అవి వాస్తవాలు’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అంతకుముందు క్రెడాయ్‌ ప్రతినిధులు మాట్లాడుతూ తమ సూచనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తగ్గించాలి: రాజశేఖర్‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా నిర్మాణ రంగానికి మద్దతిస్తోందని క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. నిర్మాణ రంగం మొత్తం కుప్పకూలిందనడంలో అర్థం లేదని.. 2017 నుంచి ఇప్పటివరకు 2లక్షలకు పైగా ప్లాట్లు రేరాలో రిజిస్ట్రేషన్‌ అయ్యాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లోనే నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతోందని.. కోకాపేట, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, బాచుపల్లి, మియాపూర్‌ ప్రాంతాల్లోనే అభివృద్ధి జరుగుతోందన్నారు. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నందున ఉపాధి అవకాశాలు కూడా అంతేస్థాయిలో ఉండనున్నాయని చెప్పారు.  ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాంతంలో స్థలాలు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ను రాజశేఖర్‌రెడ్డి కోరారు. ధరలు భారీగా పెరిగాయని.. ఆ భారాన్ని బిల్డర్లు మోయలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. నిర్మాణ రంగాన్ని ఆదుకునేందుకు మూడునెలల పాటు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తగ్గించాలని.. రెవెన్యూ తగ్గినా టర్నోవర్‌ పెరుగుతుందన్నారు. మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తే ఒక శాతం ఫీజు శాశ్వతంగా తగ్గించేట్లు చూడాలని కోరారు.

లేఔట్స్‌ క్రమబద్ధీకరణను సరళతరం చేయాలి: మురళీకృష్ణారెడ్డి

క్రెడాయ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో గూగుల్‌ సంస్థ తమ రెండో అతిపెద్ద ప్రాంగణాన్ని ప్రారంభిస్తే 30వేల ఉద్యోగాలు వచ్చినట్లేనని చెప్పారు. 111 జీవో ఎత్తివేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నామని.. దీనివల్ల 25కోట్ల చదరపు అడుగుల కమర్షియల్‌ స్పేస్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. లేఔట్స్‌ క్రమబద్ధీకరణ నిబంధనలను సరళతరం చేయాలని మురళీకృష్ణారెడ్డి కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని