Supreme court: ఎఫ్‌డీలను జప్తు చేశారో? లేదో? వివరాలివ్వండి: భారతీ సిమెంట్స్‌కు సుప్రీం ఆదేశం

భారతీ సిమెంట్స్‌ (Bharati Cements) వ్యవహారంలో హైకోర్టు తీర్పును నిలిపివేయాలంటూ సుప్రీం (Supreme Court)లో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. వారం రోజుల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం భారతీ సిమెంట్స్‌ను ఆదేశించింది.

Updated : 06 Feb 2023 19:33 IST

దిల్లీ: భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్‌మెంట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బ్యాంకు గ్యారెంటీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విడుదల విషయంలో భారతీ సిమెంట్స్‌కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ ఈడీ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ నేతృత్వంలోని ధర్మాసనం అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా భారతీ సిమెంట్స్‌ను ఆదేశించింది. ఆ తర్వాతే తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

భారతీ సిమెంట్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. బ్యాంకు గ్యారెంటీ తీసుకొని ఆస్తులు, ఎఫ్‌డీలను విడుదల చేయాలని హైకోర్టు తీర్పునిచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంకు హామీ తీసుకున్న తర్వాత కూడా రూ.150 కోట్ల విలువైన ఎఫ్‌డీలను ఈడీ జప్తు చేసుకుందని కోర్టుకు వివరించారు. అయితే, ఎఫ్‌డీలను జప్తు చేసుకోలేదని ఈడీ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సంజయ్‌ జైన్‌ కోర్టుకు తెలిపారు. ఎఫ్‌డీలను జప్తు చేశారో? లేదో? అన్న వివరాలతో వారం రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని భారతీ సిమెంట్స్‌ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ అఫిడవిట్‌ను తాము కూడా పరిశీలించి తగిన సమాధానం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీనికి అత్యున్నత ధర్మాసనం ఆమోదం తెలిపింది. ప్రతివాదిగా ఉన్న భారతీ సిమెంట్స్‌ అఫిడవిట్‌ దాఖలు చేసిన తర్వాతే తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని