వ్యాక్సిన్‌ తీసుకోవాలంటే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వారికి మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ అందించనున్నట్లు కేంద్ర

Published : 25 Apr 2021 17:23 IST

న్యూదిల్లీ: 18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వారికి మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, వ్యాక్సిన్‌ తీసుకునేవారు తప్పనిసరిగా కొవిన్‌ వెబ్‌ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సిందేనని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన వారు కూడా కొవిన్‌ వెబ్‌పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. అయితే, ఆధార్‌కార్డుతో నేరుగా వాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లినా వైద్య సిబ్బంది పేరు, వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్‌ ఇస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతుండటంతో మే 1వ నుంచి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకునేలా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ‘వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఒక్కసారిగా డిమాండ్‌ పెరుగుతుంది. వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద జనాభా తాకిడి ఎక్కువవుతుంది. దీన్ని నియంత్రించడానికే కొవిన్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు తప్పనిసరి చేశాం. నేరుగా ఆయా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోవడాన్ని ప్రస్తుతానికి అంగీకరించం’ అని ఉన్నతాధికారులు తెలిపారు. 18 సంవత్సరాల వయసు దాటిన వారందరూ కొవిన్‌ పోర్టల్‌, ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా ఏప్రిల్‌ 28వ తేదీ నుంచి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. మరోవైపు వ్యాక్సిన్‌ కంపెనీలు ఇప్పటికే తమ ధరలను ప్రకటించగా, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్‌ అందించనున్నట్లు స్పష్టం చేశాయి.

‘కొవాగ్జిన్‌’ టీకాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు రూ.600లకు, ప్రైవేటు ఆస్పత్రులకు ఒక డోసు టీకా రూ.1200 ధరకు ఇస్తుంది. ఎగుమతి ధర 15 డాలర్ల నుంచి 20 డాలర్ల (దాదాపు రూ.1100-1500) వరకూ ఉంటుంది. ఇక కొవిషీల్డ్‌  కొత్త ధరల ప్రకారం ప్రైవేటు ఆస్పత్రులకు రూ.600, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400లకు వ్యాక్సిన్‌ను అందించనుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికలాగే రూ.150కే కొనుగోలు చేయనుంది. రిజిస్ట్రేషన్‌ కోసం https://selfregistration.cowin.gov.in/ వీక్షించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని