Panjshir: మసూద్‌ ఇక్కడ..! పంజ్‌షిర్‌ నుంచి సింహగర్జన..!

అదిగో తాలిబన్లు వచ్చేస్తున్నారు.. ! ఇదిగో బద్రీ313 ఫోర్స్‌.. ! అమెరికా సైన్యం పరార్‌..! తోకముడిచిన సంకీర్ణ సేనలు.. ! ఇలా తాలిబన్లు చేసిన ప్రచార యుద్ధానికి అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ అదిరిపోయి..

Updated : 24 Aug 2021 04:23 IST

 తాలిబన్లకు కొరుకుడు పడని అందాల లోయ..!

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

అదిగో తాలిబన్లు వచ్చేస్తున్నారు.. ! ఇదిగో బద్రీ313 ఫోర్స్‌.. ! అమెరికా సైన్యం పరార్‌..! తోకముడిచిన సంకీర్ణ సేనలు.. ! ఇలా తాలిబన్లు చేసిన ప్రచార యుద్ధానికి అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ అదిరిపోయి.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు పలాయనం చిత్తగించారు.. అదే సమయంలో పనిలోపనిగా ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ కూడా పారిపోయాడంటూ తాలిబన్లు ప్రచారం చేపట్టారు..! ఇంతలో ‘ఇప్పుడు నేనే అధ్యక్షుడిని.. దేశంలోనే ఉన్నాను’అంటూ అమ్రుల్లా ఓ ట్వీట్‌ చేశారు..! ఇది అంత తేలిగ్గా తేలదని తాలిబన్లకు ఏదో మూల అనుమానంగానే ఉంది.. ! ఆ తర్వాత పంజ్‌షిర్‌ నాయకుడు అహ్మద్‌ మసూద్‌తో అమ్రుల్లా భేటీ అయిన ఫొటోలు బయటకు వచ్చాయి. తాలిబన్ల గుండెల్లో రాయిపడినట్లైంది..! కాబుల్‌ అంత తేలిగ్గా పంజ్‌షిర్‌ దక్కదని వారికి అర్థమైంది..! అది కేవలం ఆ ప్రాంతానికి ఉన్న భౌగోళిక పరిస్థితే కారణం కాదు.. అఫ్గానిస్థాన్‌ మొత్తం రాజీ పడినా.. ఇక్కడి నేతలు వెనక్కి తగ్గలేదు. కారణం.. వారు తాలిబన్ల చేతిలో ఆత్మీయులను కోల్పోవడమే..!

ఎవరీ మసూద్‌ అహ్మద్‌..!

పంజ్‌షిర్‌ సింహంగా పేరున్న అహ్మద్‌ షా మసూద్‌ సంతానంలో పెద్దవాడు. స్కూల్‌ విద్య ఇరాన్‌లో పూర్తి చేసుకొన్నా.. సైనిక విద్య మాత్రం బ్రిటీష్‌ ఆర్మీకి చెందిన మిలటరీ అకాడమీ ఫర్‌ ఆఫీసర్స్‌లో పూర్తి చేశారు. 2015లో కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ అందుకొన్నారు. యూనివర్శిటీ ఆఫ్‌ లండన్‌ నుంచి అంతర్జాతీయ రాజకీయాల్లో మాస్టర్స్‌ అందుకొన్నారు. 2001లో విలేకర్ల రూపంలో అల్‌ఖైదా ఉగ్రవాదులు ఆయన తండ్రి అహ్మద్‌ షా మసూద్‌పై ఆత్మాహుతి దాడి చేశారు. అప్పట్లో అహ్మద్‌ షా నార్తర్న్‌ అలయన్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. 

విద్యాభ్యాసం ముగించి పంజ్‌షిర్‌ చేరుకొన్న అహ్మద్‌ మసూద్‌ 2019లో అమెరికా దళాల ఉపసంహరణపై చర్చలు మొదలు పెట్టగానే భవిష్యత్తుపై ఆయన ఓ అంచనాకు వచ్చేశారు. శాంతి చర్చలు సరైన మార్గంలో లేవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. తండ్రి ప్రారంభించిన నార్తర్న్‌ అలయన్స్‌ బాటలోనే ‘ది నేషనల్‌ రెసిస్టన్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌’ను ప్రారంభించారు. 

అందుకే వాషింగ్టన్‌ పోస్టులో ఓప్‌ ఎడ్‌ రాసింది..!

బైడెన్‌పై వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచేందుకు అహ్మద్‌ మసూద్‌ అమెరికా పత్రికలను ఎంచుకొన్నారు. ఇప్పటికే అడ్డగోలుగా బలగాల ఉపసంహరణతో బైడెన్‌ సర్కార్‌ అభాసుపాలైంది. 20 ఏళ్లుగా అమెరికన్‌ సైనికుల త్యాగాలను, ధనాన్ని ప్రభుత్వం బూడిదలో పోసిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు తాలిబన్ల వికృత చేష్టలు చూసి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అఫ్గాన్లు తాలిబన్ల భయంతో విమానాలకు వేలాడటం.. వాటి పై నుంచి పడి చనిపోవడం వంటి వార్తలు దీనికి ఆజ్యం పోశాయి. ఈ సమయంలో పంజ్‌షిర్‌ నుంచి తాలిబన్లను ఎదుర్కొనేందుకు రెసిస్టన్స్‌ ఫోర్స్‌ ముందుకొచ్చి.. తమకు సాయం చేయమని అమెరికాను బహిరంగంగానే కోరింది. ఈ మేరకు మసూద్‌ వాషింగ్టన్‌పోస్టులో ఓప్‌ఎడ్‌ వ్యాసం రాయటం సంచలనం సృష్టించింది. 2001లో అమెరికాకు భారీగా సాయం చేసింది పంజ్‌షిర్‌ పోరాట యోధులే. ఇప్పుడు వారిని అమెరికా గాలికొదిలేస్తే దేశ ప్రజల ముందు బైడెన్‌ ఇమేజ్‌ ఘోరంగా దెబ్బతినే పరిస్థితి నెలకొంది. 

నాటికి పూర్తి వ్యతిరేక పరిస్థితి..

గుల్ముద్దీన్‌ హెక్మత్‌యర్‌ వంటి ముఠా నేతలు తాలిబన్ల ఎదుట తలవంచారు. కానీ, 1995లో పంజ్‌షిర్‌ లోయకు చెందిన అహ్మద్‌ షా మసూద్‌ ఒంటరిగా కాబుల్‌కు రెండు గంటల దూరంలోని తాలిబన్ల అడ్డా అయిన మదీన్‌ హషర్‌కు వెళ్లారు. ఆ సమయంలో అతను పూర్తి నిరాయుధుడు, ఒంటరిగా వచ్చాడు. అంతర్యుద్ధాన్ని ఆపేలా కొన్ని గంటలపాటు తాలిబన్లను ఒప్పించేందుకు ప్రయత్నించారు. చర్చలు విఫలం అయ్యాయి. నిరాశగా ఆయన తిరిగి కాబుల్‌ వచ్చారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మసూద్‌తో చర్చలు జరిపిన తాలిబన్‌ నాయకుడిని సహచరులే హత్య చేశారు. మసూద్‌ను ప్రాణాలతో పంపించినందుకే వారు ఈ ఘాతకానికి తెగబడ్డారు. ఈ ఘటన తర్వాత మసూద్‌ పంజ్‌షిర్‌కు చేరుకొని నార్తర్న్‌ అలయన్స్‌ ఏర్పాటు చేసి తాలిబన్లపై పోరాటం మొదలుపెట్టారు. 2001లో తాలిబన్లు, అల్‌ఖైదా ఉగ్రవాదులు కలిసి విలేకరుల రూపంలో మసూద్‌ను హత్య చేశారు. 

ఈ సారి అహ్మద్‌షా మసూద్‌ తనయుడు అహ్మద్‌ మసూద్‌ అసలు చర్చలకే మొగ్గు చూపడంలేదు. తాలిబన్లు మాత్రం ఇప్పటికే రష్యన్లను ఆశ్రయించి చర్చలకు తీవ్ర యత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని రష్యా దౌత్యకార్యాలయం కూడా ధ్రువీకరించింది.  

రాజీపడని అమ్రుల్లా సలేహ్‌..!

కాబుల్‌ సరిహద్దులకు తాలిబన్లు చేరుతున్నారని తెలియగానే అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇక ఉపాధ్యక్షుడు అమ్రుల్లా  హెలికాప్టర్‌లో పంజ్‌షిర్‌ చేరుకొన్నారు. అహ్మద్‌ షా మసూద్‌ కుటుంబానికి అమ్రుల్లా చాలా దగ్గరి వ్యక్తి. తజక్‌ జాతికి చెందిన సలేహ్‌ యువకుడిగా ఉన్నప్పుడే తాలిబన్లపై పోరాటం మొదలుపెట్టారు. వాస్తవానికి సలేహ్‌కు సోదరి తప్ప ఎవరూ లేరు. 1996లో సలేహ్‌ కోసం అతని సోదరిని తాలిబన్లు చిత్ర హింసలకు గురి చేశారు. ఈ విషయాన్ని మర్చిపోలేనని ఆయనే టైమ్‌ మ్యాగజైన్‌కు రాసిన ఓ ఎడిటోరియల్‌లో పేర్కొన్నారు. 

1997లో అమ్రుల్లా తజకిస్థాన్‌లో అఫ్గాన్‌ దౌత్యకార్యాలయంలో లైజన్‌ ఆఫీస్‌లో  పనిచేశారు. ఈ క్రమంలో ఆయన విదేశీ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలతో  బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకొన్నారు. 9/11దాడుల తర్వాత అమ్రుల్లా అమెరికా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ సీఐఏకు కీలక సహాయకుడిగా మారిపోయారు. ఆ సమయంలో అమ్రుల్లా తాలిబన్ల పతనంలో కీలక పాత్ర పోషించారు.

ముషారఫ్‌కు షాకిచ్చి..!

2004లో కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ, నేషనల్‌ సెక్యూరిటీ డైరెక్టరేట్‌గా వ్యహరించారు. ఈ క్రమంలో ఆయన బలమైన గూఢచర్య నెట్‌వర్క్‌ను  తయారు చేశారు. తాలిబన్ల అనుపానులు మొత్తం తెలుసుకొన్నారు. పాకిస్థాన్‌లోనే ఒసామా బిన్‌ లాడెన్‌ ఉన్న విషయాన్ని గ్రహించారు. ఓ సమావేశంలో నాటి పాక్‌ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌తో మాట్లాడుతూ ‘మీ దేశంలోనే  ఒసామా బిన్‌ లాడెన్‌ దాక్కున్నాడు’ అని కుండబద్దలు కొట్టారు. దీంతో ఆ సమావేశం నుంచి ముషారఫ్‌ విసవిసా వెళ్లిపోయారు.  తాలిబన్‌ నాయకులు, వారి కుటుంబాలు, ఇళ్లు, దాక్కునే ప్రదేశాలు, కాంట్రాక్టులు, ఆదాయ మార్గాలు మొత్తం అమ్రుల్లా గుప్పిట్లో ఉన్నాయి.  పాక్‌ జనరల్‌ ఏఏకే నియాజీ భారత్‌కు లొంగిపోయిన ఫొటోను ట్వీట్‌ చేసి సంచలనం సృష్టించింది కూడా ఈయనే. 

ఆ తర్వాత నాటి అఫ్గాన్‌ అధ్యక్షుడు హమీద్‌ ఖర్జాయ్‌ తీరు నచ్చక అష్రఫ్‌ ఘనీ వర్గంతో కలిశారు. క్రమంగా దేశానికి వైస్‌ ప్రెసిడెంట్‌ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తిరిగి పోరాట యోధుడి అవతారం ఎత్తారు. ఎట్టి పరిస్థితుల్లో తాలిబన్లకు లొంగిపోయే పరిస్థితే లేదని ఆయన ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు. ఇప్పటికే పంజ్‌షిర్‌లో పోరాటానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 

పంజ్‌షిర్‌ ఎంత అందంగా.. దుర్భేద్యంగా ఉంటుందో.. 2016లో అహ్మద్‌ మసూద్‌ షేర్‌ చేసిన వీడియో.. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని