Supreme court: ఏపీ ప్రభుత్వ అప్పీళ్లపై సుప్రీం ఆగ్రహం.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జరిగిన పర్యావరణ నష్టానికి ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది....

Published : 26 Sep 2022 15:32 IST

దిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జరిగిన పర్యావరణ నష్టానికి ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లాయర్లకు ఫీజు చెల్లింపులో ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి పర్యావరణ రక్షణపై కనిపించడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలవరం నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ప్రిన్సిపల్‌ బెంచ్‌ ఏపీ ప్రభుత్వానికి రూ.120 కోట్లు జరిమానా విధించిన విషయం తెలిసిందే. పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయంటూ మొత్తంగా 3 ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను పొందుపరుస్తూ ఎన్జీటీ తీర్పు వెల్లడించింది.

ఎన్‌జీటీ తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 3 అంశాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మూడు వేర్వేరు అప్పీళ్లను సుప్రీంలో దాఖలు చేసింది. ఏపీ అప్పీళ్లపై జస్టిస్‌ రస్తోగి, జస్టిస్‌ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికీ పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న పెంటపాటి పుల్లారావు తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. అప్పీళ్ల విషయంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

‘‘ఒక్క కేసుకు ఎందరు సీనియర్‌ లాయర్లను ఎంగేజ్‌ చేస్తున్నారు? సీనియర్‌ న్యాయవాదులను రంగంలోకి దించి కేసులు వాదించేందుకు తీసుకుంటున్న శ్రద్ధ పర్యావరణ పరిరక్షణలో లేదు. ఈ కేసులో లాయర్లకు ప్రభుత్వం ఎంత చెల్లించిందో తెలుసుకునేందుకు అవసరమైతే నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఎన్‌జీటీ తీర్పులపై దాఖలైన అన్ని అప్పీళ్లను ఒకేసారి విచారిస్తాం. పోలవరం, పురుషోత్తమపురం, పులిచింతలపై ఇచ్చిన తీర్పులపై విచారణ చేపడతాం’’ అని ధర్మాసనం తెలిపింది. ఏపీ ప్రభుత్వం వేసిన 3 అప్పీళ్ల విచారణకు కేసు విచారణను వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని