Top 10 news @ 1 PM

ఈనాడు.నెట్‌లో ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Updated : 11 Jun 2021 13:10 IST

1. TS News: తెరాస ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు

తెరాస లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన మధుకాన్‌ గ్రూప్‌ సంస్థలు సహా ఐదు చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రుణాల పేరుతో బ్యాంకులను సుమారు రూ.వెయ్యి కోట్లకు మోసం చేసినట్లు వచ్చిన అభియోగాలతో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. AP News: ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం జగన్‌ భేటీ

ఏపీ సీఎం జగన్‌ రెండోరోజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా కేంద్ర ఉక్కు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ, కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌, పెట్రో వర్సిటీ ఏర్పాటు తదితర అంశాలపై కేంద్రమంత్రితో జగన్‌ చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో తాము సూచించిన ప్రత్యామ్నాయాలను సీఎం మరోసారి కేంద్రమంత్రికి వివరించారు. కాకినాడ ఎస్‌ఈజడ్‌లో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలని కోరారు. వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ విషయంలో రాష్ట్రంపై పెద్దగా భారం లేకుండా చూడాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. Corona: 95 శాతానికి చేరిన రికవరీ రేటు

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. వరుసగా నాలుగో రోజూ కొత్త కేసులు లక్షకు దిగువనే నమోదయ్యాయి. తాజాగా 20,44,131 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 91,702 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసులు కొద్దిమేర తగ్గాయి. మొత్తం కేసుల సంఖ్య 2,92,74,823 చేరింది. తాజాగా మరోసారి 3వేలకు పైగా మరణాలు సంభవించాయి. నిన్న 3,403 మంది మృత్యు ఒడికి చేరుకోగా.. మొత్తం మరణాలు 3.6లక్షలకు పైబడ్డాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

ప్రణాళికరహిత టీకా పంపిణీతో కొత్త స్ట్రెయిన్లు..!

4.  Petrol: హైదరాబాద్‌లో రూ.100కు చేరువలో...

దేశంలో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. వరుస పెంపులతో చుక్కలను తాకుతున్నాయి. చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను శుక్రవారం మరోసారి పెంచాయి. నేడు లీటర్‌ పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరిగింది. దీంతో దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102 దాటింది. ఇక దిల్లీలో రూ. 95.85కి చేరింది. లీటర్‌ డీజిల్ ధర ముంబయిలో రూ. 94.14, దిల్లీలో రూ. 86.75గా ఉంది. హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌ ధర రూ.100కు చేరువైంది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. TS News: షర్మిల కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

 వికారాబాద్‌ జిల్లా పరిగి పర్యటనకు వెళ్తున్న వైఎస్‌ షర్మిల కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పరిగిలో వరి కొనుగోళ్ల తీరును పరిశీలించేందుకు షర్మిల హైదరాబాద్ నుంచి వెళ్తుండగా పూడూరు మండలం అంగడిజితెంపల్లి గేటు వద్దకు రాగానే పోలీసులు ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అనుమతులకు మించి వాహనాలు కాన్వాయ్‌లో ఉండటంతో వాటిని పక్కకు నిలిపేశారు. అనంతరం ఐదు వాహనాల చొప్పున అనుమతించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మెరుగైన‌ పెట్టుబ‌డి ప‌థ‌కాలు

6. Yogi Adityanath: ప్రధానితో యోగి భేటీ

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ వేడి మొదలైంది. కాంగ్రెస్‌ నుంచి జితిన్‌ ప్రసాద చేరిక, త్వరలో మంత్రివర్గ విస్తరణ వంటి పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిల్లీ పర్యటన మరింత ఉత్కంఠను రేపుతోంది. పర్యటనలో భాగంగా ఆయన నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ ఉదయం లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకున్న యోగి.. ఆయనతో సమావేశమయ్యారు. యూపీ మంత్రివర్గంలో మార్పులపై ప్రధానితో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

7.TS News: మత్తుగుట్టు విప్పుతున్న లాక్‌డౌన్‌

కొవిడ్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించడం, ఇంటి నుంచే పని, పాఠాలు కొనసాగుతుండటంతో మత్తుమందులకు అలవాటుపడ్డ వారి బండారం బయటపడుతోంది. తల్లిదండ్రులతో కలిసి ఉండటం వల్ల మత్తుమందులు వాడే అవకాశం లేకపోవడం, లభ్యం కాకపోవడంతో పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నారు. దాంతో కుటుంబ సభ్యులకు దొరికిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతా పెద్దసంఖ్యలో బాధితులు వస్తుండటంతో వైద్యులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మత్తుమందుల వాడకం విపరీతంగా పెరిగిందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గంజాయి సంస్కృతి మారుమూల ప్రాంతాలకూ విస్తరించింది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Raina: లక్ష్యాలు ఛేదించడం ఛాపెలే నేర్పించాడు

8. IT: విప్రో సీఈఓకే అధిక వేతనం.. ఎంతంటే?

విప్రో ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) థియర్రీ డెలాపోర్ట్‌ గత ఆర్థిక సంవత్సరంలో 8.7 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.64.3 కోట్లు) వార్షిక వేతనం అందుకున్నట్లు నియంత్రణ సంస్థలకు సంస్థ సమాచారం అందించింది. ఏకకాల నగదు పురస్కారం, వార్షిక స్టాక్‌ గ్రాంట్‌, ఏకకాల ఆర్‌ఎస్‌యూ (రిస్ట్రిక్టెడ్‌ స్టాక్‌ యూనిట్లు) గ్రాంట్‌ వంటివన్నీ కలిపి 2020 జులై 6 నుంచి 2021 మార్చి 31 వరకు ఆయన ఈ మొత్తం అందుకున్నట్లు విప్రో తెలిపింది. విప్రో 20-ఎఫ్‌ ఫైలింగ్‌ ప్రకారం, డెలాపోర్ట్‌ 1.31 మిలియన్‌ (సుమారు రూ.9.6 కోట్లు) వేతనం, అలవెన్సుల రూపంలో, 1.54 మిలియన్‌ డాలర్ల కమీషన్‌ - వేరియబుల్‌ పే రూపంలో,  5.18 మిలియన్‌ డాలర్లు ఇతర రూపంలో అందుకున్నట్లు విప్రో వివరించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. దుష్ప్రభావాలు లేకున్నా టీకా పనిచేస్తున్నట్లే 

 ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ టీకాల వల్ల కొద్దిమందిలో తలెత్తుతున్న దుష్ప్రభావాలు చర్చనీయాంశమవుతున్నాయి. అయితే వ్యాక్సిన్‌ పొందాక ఒకటి రెండు రోజుల పాటు తలెత్తే లక్షణాలు.. రోగనిరోధక వ్యవస్థ క్రియాశీలం కావడానికి సంబంధించిన సంకేతాలేనని, ఇవి మామూలేనని నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ పొందాక ఒకరోజుపాటు శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పనులు చేపట్టవద్దని నిపుణులు సూచిస్తున్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. G-7: ప్రపంచానికి బిలియన్‌ డోసుల భరోసా!

కరోనా విజృంభణ, వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో జి-7 శిఖరాగ్ర సదస్సులో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ డోసుల్ని వివిధ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని సభ్యదేశాలు నిర్ణయించనున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాలు  కొవిడ్‌తో అతలాకుతలమవుతున్న తరుణంలో ధనిక దేశాలు మిగులు టీకాలను నిల్వ చేసుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో జి-7 కూటమి నుంచి ఈ నిర్ణయం వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని