కొండ కోనల్లోంచి.. ఆసుపత్రికి చేర్చి

కొండ కోనల్లో ఉండే మహిళలకు కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి ప్రసవమయ్యే వరకు దినదిన గండమే. ఎప్పుడు ఇబ్బంది వచ్చినా వైద్యం కోసం సాహసం చేయక తప్పని పరిస్థితి. డోలీ కట్టి కిలోమీటర్ల మేర మోసుకెళ్తే కానీ ఆసుపత్రికి చేరుకోలేని దయనీయ స్థితి. ఇటువంటి పరిస్థితుల్లో 2వేల అడుగుల ఎత్తులోనున్న గిరిజన గూడెం నుంచి గర్భిణీని తరలించేందుకు ఓ కుటుంబం చేసిన పోరాటం అనన్య సామాన్యం

Published : 13 Aug 2020 02:19 IST

పాడేరు: విశాఖ మన్యంలో కొండలు, కోనలకు లెక్కే లేదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వేలాది అడుగుల కొండలపై నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కిందికి దిగి రావాల్సిందే. ఇక అలాంటి చోటు నుంచి గర్భిణులను ఆసుపత్రులకు తీసుకువెళ్లడమంటే ఎంతో కష్టం. అందుకోసం అడవి బిడ్డలు అతి పెద్ద సాహసం చేయక తప్పదు. పాడేరు మండలం దేవాపురం పంచాయతీ కూడా అలాంటిదే. అత్యంత ఎత్తైన కొండల మీద ఉంటుంది. ఆ పరిధిలోని హనుమంతపురంలో నివాసం ఉండే ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నలుగురు కుటుంబ సభ్యులు కలిసి పోరాటం ప్రారంభించారు. డోలీ కట్టి గర్భిణిని మోసుకుంటూ కొండ మార్గాన సాహసోపేతంగా అడుగులు వేశారు. ఏ మాత్రం అడుగు తడబడినా ప్రాణగండం తప్పదనేలా ఉన్న చిత్తడి కొండలపై అత్యంత జాగ్రత్తగా ముందుకు సాగారు. అలా కొన్ని కిలోమీటర్ల మేర పయనించి దూరాన ఉన్న మాడుగుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. 
గిరిజన గూడేల నుంచి డోలీ కట్టి గర్భిణులను తరలించడం నిత్యకృత్యమే. కానీ హనుమంతపురం లాంటి చోటి నుంచి వెళ్లడం మాత్రం ఒకరకంగా పర్వతం మీది నుంచి దిగినట్లే. అతిపెద్ద చెట్లు, ఎటు చూసినా గుబురు పొదలు, పెద్దపెద్ద బండరాళ్లతో ప్రమాదకరంగా ఉండే కొండలపై నుంచి కిందికి రావాలంటే కాసేపటికే కాళ్లు పట్టేస్తాయి. అంత కష్టతరమైన ప్రాంతం నుంచి గర్భిణిని మోసుకెళ్లడం అంటే అంతకు మించిన సాహసం మరొకటి ఉండదేమో. అయినా పట్టు సడకలకుండా అకుంఠిత దీక్షతో మాడుగుల చేరుకున్న గిరిపుత్రులు నిజంగా సాహస వీరులే. పాడేరు ఐటీడీఏ పరిధిలో ఏ సమావేశం జరిగినా మంత్రులు, ప్రజాప్రతినిధుల నోట కచ్చితంగా వినపడే మాట డోలీ కష్టాలే. ఏళ్లుగా ఆడబిడ్డలు పడుతున్న ఈ కష్టాలను కడతేరుస్తామని హామీలిచ్చే నేతలు.. తరువాత మరచిపోతూనే ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా గిరిజనం బతుకు పోరాటం సాగిస్తూనే ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని