
కాళేశ్వరంలో జల సవ్వడి
ఇంటర్నెట్డెస్క్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి నీటిని రేయింబవళ్లు తరలిస్తుండటంతో కొత్త శోభను తెచ్చి పెడుతోంది. రాత్రి వేళలో ఆరు మోటార్లు నీటిని ఎత్తిపోసే దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఎస్సారెస్పీ, మధ్య మానేరు, దిగువ మానేరు జలాశయాలతో పాటు ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలను నింపాలనే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి.
ఇప్పటికే దిగువ మానేరు జలాశయంలో నీరు 20 టీఎంసీలకు చేరడంతో మధ్యమానేరు నుంచి నీటి విడుదల ఆపేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో తొలుత నంది పంపుహౌస్లో రెండు మోటార్లను ఆన్ చేశారు. అనంతరం మోటార్ల సంఖ్యను క్రమంగా పెంచుతూ వచ్చారు. దీంతో ఎల్లంపల్లి జలాశయం నుంచి 18,900 క్యూసెక్కుల ప్రవాహం నంది మేడారం జలాశయంలోకి చేరుతోంది. నంది మేడారం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 233 మీటర్లు కాగా.. 230.5 మీటర్ల నీటి మట్టం స్థిరంగా ఉండేలా చూస్తూ గాయత్రీ పంప్హౌస్కు వదులుతున్నారు. అక్కడి నుంచి ఆరు బాహుబలి మోటార్లతో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. వరద కాలువ ద్వారా మధ్య మానేరుకు మరో వైపు రాజరాజేశ్వర జలాశయానికి గాయత్రీ పంప్హౌస్ నుంచి వరద కాలువ ద్వారా 18,900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దీంతో మధ్య మానేరు సామర్థ్యం 27 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 20 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులో నీరు పూర్తి స్థాయికి చేరే వరకు ఎత్తిపోతలు కొనసాగే అవకాశముంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.