2years of Corona: భారత్‌లో కరోనా.. నేటితో రెండేళ్లు..!

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి వెలుగు చూసి నేటితో (జనవరి 30) రెండేళ్లు పూర్తయ్యింది.

Updated : 30 Jan 2022 18:09 IST

టీకా, కొవిడ్‌ నిబంధనలే ఆయుధాలుగా మహమ్మారిపై కొనసాగుతోన్న పోరు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి వెలుగు చూసి నేటితో (జనవరి 30) రెండేళ్లు పూర్తయ్యింది. ఈ రెండు సంవత్సరాల కాలంలో 4కోట్ల మందిలో వైరస్‌ వెలుగు చూడగా.. 4లక్షల 94వేల మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది. ఇంతటి ప్రాణాంతక వైరస్‌ను ఎదుర్కొనేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులతో యావత్‌ దేశం పోరాటం చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఓవైపు వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తూనే మరోవైపు కొవిడ్‌ నిబంధనలతో కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా కరోనాను నయం చేసే కచ్చితమైన చికిత్స మాత్రం ఇంకా అందుబాటులోకి రాకపోవడం నిరాశ కలిగించే విషయం.

భారత్‌లో జనవరి 30, 2020 తేదీన తొలి కరోనా కేసు నమోదయ్యింది. వుహాన్‌ యూనివర్సిటీలో మెడిసిన్‌ చదువుతోన్న ఓ భారత విద్యార్థినికి తొలుత పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కేరళకు చెందిన ఆ యువతి సెమిస్టర్‌ సెలవుల్లో భారత్‌కు వచ్చిన సమయంలో వైరస్‌ వెలుగు చూసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో పలు దఫాల్లో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతో దేశంలో మూడోవేవ్‌ విజృంభణ కొనసాగుతోంది. ఇలా కొత్త వేరియంట్ల రూపంలో విజృంభిస్తోన్న కొవిడ్‌ మహమ్మారితో ప్రపంచ దేశాలు మరిన్ని వేవ్‌లను చవిచూస్తూనే ఉన్నాయి.

పెరిగిన ఔషధాల వాడకం..

కొవిడ్‌-19ను నిరోధించే వ్యాక్సిన్‌ గతేడాది నుంచి అందుబాటులోకి రావడంతో యావత్‌ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. కానీ వ్యాధిని నయం చేసే సరైన చికిత్స కోసం గత రెండేళ్లుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు పలు ఔషధాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నప్పటికీ కచ్చితమైన చికిత్స మాత్రం అందుబాటులోకి రాలేదు. ఇటు భారత్‌లో కొవిడ్‌ విజృంభణ వేళ ఔషధాల వాడకం విపరీతంగా పెరగడం పట్ల నీతి ఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఆరోగ్యశాఖ సూచించిన ఔషధాలను మాత్రమే తగిన మోతాదులో వాడాలని సూచించిన ఆయన.. తీవ్ర లక్షణాలు ఉంటే తప్ప ఎక్కువ ఔషధాలు, స్టెరాయిడ్లు విరివిగా వాడితే ఇతర ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరించారు.

కీలక ఆయుధంగా టీకా..

కొవిడ్‌-19 తీవ్రతను తగ్గించేందుకు ప్లాస్మా థెరపీ, రెమ్‌డెసివిర్‌, డీఆర్‌డీఓ తయారు చేసిన 2డీజీ ఔషధంతోపాటు ఇటీవల మోల్నూపిరవిర్‌ వంటి ఔషధాలతో ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ కొవిడ్‌ బాధితులు కోలుకునేందుకు ప్రత్యేకంగా కచ్చితమైన ఔషధం మాత్రం ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. మరోవైపు కొవిడ్‌ను నయం చేయడంలో యోగా, ధ్యానం వంటి వాటితోనూ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో ఒమిక్రాన్‌ రూపంలో మరో వేవ్‌ ముంచుకొచ్చింది. దీని ప్రాబల్యాన్ని తగ్గించేందుకు వ్యాక్సిన్‌, కొవిడ్‌ నిబంధనలను మాత్రమే కీలక ఆయుధాలుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 95శాతానికిపైగా అర్హులకు వ్యాక్సిన్‌ ఒకడోసు అందగా.. 75శాతం అర్హులకు పూర్తి మోతాదులో పంపిణీ జరిగింది. వందశాతం అర్హులకు వ్యాక్సిన్‌ అందడమే లక్ష్యంతో వ్యాక్సిన్‌ అందించాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ ఇటీవలే ఉద్ఘాటించారు. కొత్త వేరియంట్ల దృష్ట్యా కొవిడ్‌ ముప్పు అధికంగా ఉన్నవారికి ప్రికాషినరీ డోసు పేరుతో మూడో డోసును కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. మరోవైపు చిన్నారులకు టీకా అందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని