తొలిరోజు..3లక్షల మందికి టీకా..!

జనవరి 16న ప్రారంభం కానున్న టీకా పంపిణీ కార్యక్రమం తొలిరోజు దాదాపు 3లక్షల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకా ఇవ్వనున్నట్లు సమాచారం.

Updated : 14 Jan 2021 12:58 IST

ఏర్పాట్లలో నిమగ్నమైన రాష్ట్రాలు

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే నిర్దేశించిన ప్రాంతాలకు వ్యాక్సిన్‌ రవాణా జరుగుతోంది. అయితే, జనవరి 16న ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో తొలిరోజు దాదాపు 3లక్షల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకా ఇవ్వనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2934 కేంద్రాల్లో ఈ టీకాలను అందించనున్నారు. ప్రతి కేంద్రంలో వంద మందికి టీకాలు ఇచ్చే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని భారత ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 16న ప్రారంభించనున్నారు. ఇందుకోసం కావాల్సిన టీకాలను దేశవ్యాప్తంగా నిర్దేశించిన 12 ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రతి కేంద్రంలోనూ నిర్దేశించుకున్న టీకాల సంఖ్య కంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు సూచించింది. అవసరమైన వాటికంటే పదిశాతం (రిజర్వు/వేస్టేజ్‌ డోసులను) అదనంగా అందుబాటులో ఉంచుకోవాలని తెలిపింది. ప్రస్తుతం ఉన్న టీకా కేంద్రాల సంఖ్యను రాష్ట్రాలు పెంచుకుంటూ వెళ్లాలని సూచించింది.

దేశంలో అత్యవసర వినియోగం కింద కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వీటిలో ఏ టీకా తీసుకోవాలనే ఆప్షన్‌ ప్రస్తుతానికి లబ్ధిదారులకు ఉండదని కేంద్రం ఇప్పటికే స్పష్టంచేసింది. తొలిదశలో భాగంగా కోటి మందికి టీకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవ్వగా, ఇప్పటికే వీటికి కావాల్సిన 1.65కోట్ల డోసులను ప్రభుత్వం సేకరించింది. వీటిలో 1.1కోట్ల డోసులు కొవిషీల్డ్‌వి కాగా, మరో 55లక్షల డోసులను భారత్‌ బయోటెక్‌(కొవాగ్జిన్‌) నుంచి తీసుకుంది. ఇక కరోనా వ్యాక్సిన్‌ను రెండు డోసులను 28రోజుల వ్యవధిలో ఇస్తారు. అయితే, వ్యాక్సిన్‌ తీసుకున్న 14రోజుల తర్వాతే టీకాల ప్రభావం ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ గతంలోనే స్పష్టంచేసింది. అప్పటి వరకు టీకా తీసుకున్నవారు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

ఇవీ చదవండి..
11 నగరాలకు చేరిన కొవాగ్జిన్‌
పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని