
ఆ చైనా కాన్సులేట్ మూసేయండి: అమెరికా ఆదేశం!
హ్యూస్టన్ కాన్సులేట్ మూసివేయాలని ఆదేశించిందన్న చైనా
అమెరికా రాజకీయంగా రెచ్చగొడుతుందని విమర్శ
వెనక్కి తగ్గకపోతే సరైనరీతిలో ప్రతిస్పందిస్తామని హెచ్చరిక
బీజింగ్: ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన రెండు దేశాలమధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్తోపాటు హాంగ్కాంగ్ జాతీయ భద్రతా చట్టం విషయంలో ఇప్పటికే డ్రాగన్ దేశంపై గుర్రుగా ఉన్న అమెరికా, తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. హూస్టన్లోని చైనా రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని ఆదేశించినట్లు తాజాగా చైనా వెల్లడించింది. ఇది రాజకీయంగా రెచ్చగొట్టడమేనన్న చైనా, అమెరికా నిర్ణయం ఇరుదేశాల దౌత్య సంబంధాలకు హాని చేస్తుందని అభిప్రాయపడింది.
‘హూస్టన్లోని చైనా కాన్సులేట్ మూసివేయాలని మంగళవారం అమెరికా మాకు తెలిపింది. ఈ తప్పుడు నిర్ణయాన్ని అమెరికా వెంటనే ఉపసంహరించుకోవాలని అమెరికాకు విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే చైనా నుంచి ప్రతిస్పందన చర్య కచ్చితంగా ఉంటుంది’ అని చైనా విదేశాంగ అధికారప్రతినిధి వాంగ్ వెన్బిన్ స్పష్టం చేశారు. అమెరికా ప్రారంభించిన ఈ చర్య రాజకీయంగా రెచ్చగొట్టడమేనని అభిప్రాయపడ్డారు. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా, అమెరికా-చైనా మధ్య ద్వైపాక్షిక దౌత్య ఒప్పందాలకు తూట్లు పొడవడమే అని విమర్శించారు. ఇరుదేశాల సంబంధాలను దెబ్బతీసే దారుణమైన, అన్యాయమైన ఈ చర్యలను చైనా తీవ్రంగా ఖండిస్తోందని వాంగ్ స్పష్టంచేశారు.
ఇవీ చదవండి..
చైనాపై తీవ్ర చర్యలు.. ట్రంప్