మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కేసుల తీవ్రత పెరుగతూనే ఉంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎంతో మంది వైరస్‌ బారిన పడుతున్నారు. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వైరస్‌ బారిన పడగా...

Published : 04 Aug 2020 20:01 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎంతో మంది వైరస్‌ బారిన పడుతున్నారు. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వైరస్‌ బారిన పడగా, తాజాగా కేంద్ర ఉక్కు, ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచన మేరకు హరియాణాలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు యడియూరప్ప, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. వీరితో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్ పురోహిత్‌, కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరంకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య 18 లక్షలు దాటింది. వరుసగా రెండో రోజు 50వేల కేసులు వెలుగుచూశాయి. 803 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు 12లక్షల 30వేల మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకోగా, మరో 5లక్షల 86వేల మందికి క్రియాశీలకంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని