‘1962 తరవాత ఇదే తీవ్రమైనది’:జై శంకర్‌

కొద్ది నెలల క్రితం భారత్-చైనా సరిహద్దులో మొదలైన ఉద్రిక్త వాతావారణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

Published : 27 Aug 2020 15:06 IST

భారత్-చైనా సరిహద్దు వివాదంపై కేంద్ర మంత్రి 

దిల్లీ: కొద్ది నెలల క్రితం భారత్-చైనా సరిహద్దులో మొదలైన ఉద్రిక్త వాతావారణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాలకు చెందిన దౌత్య, సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సరిహద్దు వివాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ మాట్లాడుతూ.. ‘ఇది ఖచ్చితంగా 1962 తరవాత అత్యంత తీవ్ర పరిస్థితి’ అని అభిప్రాయపడ్డారు. ఆయన రాసిన ‘ద ఇండియా వే: స్ట్రాటజీస్‌ ఫర్ యాన్‌ అన్ ‌సర్టైన్‌ వరల్డ్’ పుస్తకం విడుదల కానున్న తరుణంలో ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. సరిహద్దుల వద్ద పరిస్థితి తీవ్రతను తెలియజేశారు. 

‘1962 తరవాత ఇది కచ్చితంగా అత్యంత తీవ్రమైన పరిస్థితి. వాస్తవంగా చూస్తే..45 సంవత్సరాల తరవాత సరిహద్దు వద్ద సైనికులు మరణించడం ఇదే తొలిసారి. అలాగే వాస్తవాధీన రేఖ వద్ద ఇరువైపుల మోహరించిన బలగాల సంఖ్య కూడా చాలా ఎక్కువ’ అని వెల్లడించారు. అంతేకాకుండా పొరుగుదేశాల మధ్యసంబంధాలు ఒడుదొడుకులు లేకుండా కొనసాగాలంటే సరిహద్దుల వద్ద శాంతే కీలకమన్న విషయాన్ని చైనాకు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. సైనిక, దౌత్య అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, గత కొద్ది నెలలుగా తూర్పు లద్దాఖ్ ప్రాంతం వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. గతంలో రెండు దేశాల మధ్య దెప్సాంగ్, చుమార్, డోక్లాం వంటి సరిహద్దు వివాదాలు నెలకొన్నాయని.. కానీ, అవి చర్చలతో ముగిసిపోయాయని గుర్తు చేశారు. యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చకుండా అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తూ ప్రస్తుత పరిస్థితికి  పరిష్కారాన్ని కనుగొనాలన్నారు. ఇప్పటికే ఈ వివాదంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందేనన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని