Artificial Intelligence: కృత్రిమ మేధ.. ప్రపంచాన్ని నాశనం చేయగలదు: మోదీ

కృత్రిమ మేధను (Artificial Intelligence) సరైన పద్ధతిలో వినియోగించకపోతే ప్రపంచం ఉనికే ప్రమాదంలో పడే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.

Published : 12 Dec 2023 22:20 IST

దిల్లీ: కృతిమ మేధతో (Artificial Intelligence) ముప్పు పొంచి ఉందని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) పునరుద్ఘాటించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై దిల్లీలో నిర్వహించిన ప్రపంచ శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. భారతదేశ సాంకేతిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల సామర్థ్యం కృత్రిమ మేధకు (AI)కి ఉందని చెప్పారు. అయితే, ఈ అధునాతన సాంకేతికత ఉగ్రవాదుల చేతికి చిక్కకుండా జాగ్రత్తపడాలని, లేదంటే అనూహ్య పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచదేశాలను హెచ్చరించారు. అంతేకాకుండా టెక్నాలజీని సరైన పద్ధతిలో వినియోగించకపోతే.. ఇటీవల చర్చనీయాంశమవుతున్న డీప్‌ఫేక్‌ టెక్నాలజీ లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయని చెప్పారు.

‘‘కృత్రిమమేధతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అదే స్థాయిలో నష్టాలు కూడా ఉండటం దురదృష్టకరం. 21వ శతాబ్దంలో మానవజాతికి సాయం చేసేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఓ అద్భుతమైన సాంకేతికత. అయితే, అది మనల్ని నాశనం చేయడంలోనూ కీలక పాత్ర పోషించగలదు. ఆ కోవకు చెందినదే డీప్‌ఫేక్‌’’ అని మోదీ అన్నారు. ఒకవేళ కృత్రిమమేధ ఉగ్రవాదుల చేతికి చిక్కితే.. ప్రపంచం ఉనికే ప్రమాదంలో పడుతుందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ టెక్నాలజీని ఉపయోగించి మానవ రహిత దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఒకవేళ ఇదే పరిస్థితులు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలన్నదానిపై వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ అభివృద్ధిని భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, వాటి ఫలితాలను ప్రధానంగా వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో వినియోగించేందుకు ప్రయత్నాలు చేస్తోందని మోదీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని