Rahul Gandhi: ‘ప్రజల బాధలను దగ్గరగా చూశా’.. గడ్డకట్టే మంచులోనూ రాహుల్ ప్రసంగం

కాంగ్రెస్(Congress) కొన్ని నెలల క్రితం ప్రారంభించిన భారత్‌ జోడో యాత్రకు సోమవారం ముగింపు సభ జరిగింది. ఇందులో పార్టీకి చెందిన అగ్రనేతలు పాల్గొని, ప్రసంగించారు. 

Updated : 30 Jan 2023 19:13 IST

దిల్లీ: గడ్డకట్టే చలిలో భారత్‌ జోడో యాత్ర(Bharat Jodo Yatra) ముగింపు సభ జరిగింది. ఒకవైపు మంచు కురుస్తున్నా లెక్క చేయకుండా కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రసంగాన్ని కొనసాగించారు. ముగింపు సభలో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో లాల్‌చౌక్‌లో జెండా ఎగురవేశారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రజల సహకారం చూసి నాకు కళ్లవెంట నీరు వచ్చింది. ఒక దశలో యాత్ర పూర్తి చేయగలనా అనుకున్నా. చలిని లెక్కచేయకుండా ప్రజలు సభకు హాజరయ్యారు. వారి సహకారం లేకుండా ఏ పనీ సాకారం కాదు. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు, మహిళలు తమ బాధలు నాతో పంచుకున్నారు. ఈ పాదయాత్ర నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ప్రజల దీనస్థితి చూసే  టీషర్టుతోనే యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాను. యాత్రలో భాగంగా ఓ రోజు నలుగురు చిన్నారుల నా వద్దకు వచ్చారు. వారు యాచకులు. వారి ఒంటిపై దుస్తులు కూడా లేవు. వారు చలిలో వణికిపోతున్నారు. నాకు తెలిసి వారికి తగిన ఆహారం కూడా ఉండదు. వారు జాకెట్స్‌, స్వెట్టర్లు వేసుకోలేదు. అప్పుడే అనుకున్నా నేను కూడా వేసుకోకూడదని’ అని వెల్లడించారు.

కశ్మీర్‌లో తన పాదయాత్ర గురించి మాట్లాడుతూ.. ‘భయం లేకుండా జీవించడాన్ని నా కుటుంబం నుంచి నేర్చుకున్నాను. భయపడుతూ బతికితే అది జీవితమే కాదు. కశ్మీర్‌కు కాలినడకన కాకుండా వాహనంలో వెళ్లమని నాకు భద్రతాసిబ్బంది చెప్పారు. కాలినడకన వెళ్తే.. మీపై గ్రనేడ్లు విసిరే అవకాశం ఉందని చెప్పారు. కానీ నేను మాత్రం నా తెల్లటి టీ షర్ట్‌ను ఎరుపు రంగులో మార్చాలనుకునే వారికి అవకాశం ఇవ్వాలనుకున్నాను. ఇక్కడ నేను ఊహించినట్లే జరిగింది. ఇక్కడి ప్రజలు నాకు గ్రనేడ్లు ఇవ్వలేదు. ప్రేమను మాత్రమే పంచారు’ అని అన్నారు. అలాగే కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

దేశవ్యాప్తంగా 145 రోజుల పాటు జోడో యాత్ర సాగింది. తమిళనాడు నుంచి కశ్మీర్‌ వరకు ఈ యాత్రను కొనసాగించారు. ఈ ముగింపు సభలో ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గేతోపాటు కశ్మీరీ అగ్రనేతలు ఫరూక్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని