MBBS: హిందీలో ఎంబీబీఎస్‌.. పుస్తకాలు ఆవిష్కరించిన అమిత్‌ షా

హిందీలో ఎంబీబీఎస్‌ కోర్సు పుస్తకాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మధ్యప్రదేశ్‌లో ఆవిష్కరించారు.

Published : 16 Oct 2022 15:02 IST

భోపాల్‌: వైద్య విద్యను హిందీ (Hindi) మాధ్యమంలో కొనసాగించేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నంలో ముందడుగు పడింది. ఇందులో భాగంగా హిందీ మాధ్యమ పుస్తకాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా భోపాల్‌లో ఆవిష్కరించారు. దీంతో హిందీలో ఎంబీబీఎస్‌ (MBBS) కోర్సు ప్రారంభించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ నిలిచింది.

మధ్యప్రదేశ్‌లో 2022-23 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వ మెడికల్‌ కళాశాల్లోని మొదటి ఏడాది విద్యార్థులకు హిందీలో మెడిసిన్‌ను బోధించనున్నారు. ఇందులో భాగంగా అనాటమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల పుస్తకాలు హిందీలో అందుబాటులోకి తెచ్చారు. ఈ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. మెడికల్‌, ఇంజినీరింగ్‌ కోర్సులను హిందీలో నేర్చుకోలేమనే భావనను తొలగించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. హిందీ మాధ్యమంలో చదివి కూడా జీవితంలో ముందుకు సాగగలమనే ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ఇదో ముందడుగని అన్నారు. మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలనేది ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని సీఎం శివరాజ్‌ సింగ్‌ అంతకుముందు వ్యాఖ్యానించారు.‌

ఆంగ్లంతోపాటు హిందీ పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, సాంకేతిక పదాలు మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటాయని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ స్పష్టం చేశారు. దేశంలో ఎంబీబీఎస్‌ కోర్సును హిందీలో తీసుకువచ్చిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ నిలిలిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని