Coal Shortage: ముగ్గురు కేంద్ర మంత్రుల సమావేశం.. బొగ్గు నిల్వల పెంపు చర్యలపై సమీక్ష

దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరత ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. దీంతో బొగ్గు లభ్యత, సరఫరా పెంచేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలను పెంచేందుకు...

Published : 19 Oct 2021 21:02 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరత ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. దీంతో బొగ్గు లభ్యత, సరఫరా పెంచేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం బొగ్గు మంత్రిత్వశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌, విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ ఆన్‌లైన్‌ వేదికగా సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ప్రహ్లాద్‌ జోషి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దేశ విద్యుత్‌ డిమాండ్‌ను నెరవేర్చేందుకు తమవంతు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం ఆయన సింగ్రౌలిలో కోల్‌ ఇండియాకు చెందిన నార్తన్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(ఎన్‌సీఎల్‌)ను సందర్శించి, పనితీరును సమీక్షించారు.

ఎన్‌సీఎల్‌లో ఉత్పత్తి పెంచాలి..

బొగ్గు ఉత్పత్తి పెంచాలని, రోజుకు కనీసం 34 వ్యాగన్లు లోడ్‌ చేయాలని ఎన్‌సీఎల్‌ సీఎండీని మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులు, కార్మికులతోనూ మాట్లాడారు. ఇక్కడి నిగాహి ఓపెన్‌ కాస్ట్ ప్రాజెక్ట్‌లో మెషిన్ ఆపరేటర్లను సన్మానించారు. బొగ్గు ఉత్పత్తి పెంపు, సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. అనంతరం అక్కడ ఒక బొగ్గు డంపర్‌ ట్రక్కునూ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం ఏర్పడినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నాయని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా నిత్యం 20 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని.. రుతుపవనాల ప్రభావం తగ్గుతున్నందున రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని స్పష్టం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని