XBB.1.5: దేశంలో 26కు చేరిన కొత్త వేరియంట్‌ కేసులు : ఇన్సాకాగ్‌

ఒమిక్రాన్‌కు చెందిన కొత్తరకం కేసులు భారత్‌లో ఇప్పటివరకు 26 వెలుగు చూసినట్లు ఇన్సాకాగ్‌ వెల్లడించింది. ప్రస్తుతం 38 దేశాల్లో ఎక్స్‌బీబీ.1.5 కేసులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలిపింది.

Published : 16 Jan 2023 21:50 IST

దిల్లీ: అమెరికాతో పాటు పలు దేశాల్లో కొత్తరకం వేరియంట్‌లు (Omicron) విస్తృతంగా వ్యాప్తిలో ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్న విషయం తెలిసిందే. భారత్‌లోనూ కొత్త వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతోంది. అమెరికాలో ప్రస్తుతం కొవిడ్‌ ఉద్ధృతికి కారణమైన ఎక్స్‌బీబీ.1.5 కేసులు భారత్‌లో ఇప్పటివరకు 26 నమోదైనట్లు కొవిడ్‌ వేరియంట్లపై ఏర్పాటు చేసిన కన్సార్టియం ఇన్సాకాగ్‌ (INSACOG) వెల్లడించింది.

దిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌తో సహా మొత్తం 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు 26 ఎక్స్‌బీబీ.1.5 కేసులు వెలుగు చూశాయని ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది. ఇక చైనాలో కొవిడ్‌ విలయాలనికి కారణంగా చెబుతోన్న బీఎఫ్‌.7 కేసుల సంఖ్య కూడా భారత్‌లో 14కు చేరింది. పశ్చిమ బెంగాల్‌లో నాలుగు, మహారాష్ట్రలో మూడు, హరియాణా, గుజరాత్‌లలో రెండు చొప్పున వెలుగు చూడగా.. ఒడిశా, దిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

ఒమిక్రాన్‌ ఎక్స్‌బీబీ రకానికి చెందిన ఈ వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఏ.2 రెండు ఉపరకాల సమ్మేళనం వల్ల ఏర్పడింది. దీన్ని సూపర్‌ వేరియంట్‌గానూ పేర్కొంటున్నారు. అదనపు మ్యుటేషన్‌ కారణంగా మానవ శరీరంలోని కణాలను అంటిపెట్టుకునే లక్షణం దీనికి అధికంగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఉపరకం ప్రబలంగా ఉన్న చోట్ల ఆసుపత్రుల్లో చేరికలు పెరుగుతున్నట్లు సమాచారం. అమెరికాలో నమోదవుతున్న కేసుల్లో ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ.1.5 లకు చెందినవే 44శాతం ఉన్నాయి. ప్రస్తుతం 38 దేశాల్లో ఎక్స్‌బీబీ.1.5 కేసులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడించింది.

కేరళలో మాస్కు తప్పనిసరి..

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, సమావేశాలు, వాహనాల్లోనూ మాస్కు ధరించాలని పౌరులకు సూచించింది. వ్యక్తిగత దూరాన్ని పాటించాలని కోరింది. మరోవైపు శానిటైజర్లను ఏర్పాటు చేయాలని దుకాణాలు, థియేటర్లు, వివిధ కార్యక్రమాల నిర్వాహకులను ఆదేశించింది. రాబోయే 30 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని