భౌతిక దూరం.. వినూత్న ఐడియాలు!

ఇప్పుడిప్పుడే చాలా దేశాలు లాక్‌డౌన్‌ నుంచి కొద్దికొద్దిగా బయటకు వస్తున్న తరుణంలో కరోనా వైరస్‌ కట్టడికి సామాజిక దూరమే నివారణ మంత్రం కానుంది.

Published : 16 May 2020 01:59 IST

బెర్లిన్‌: ఇప్పుడిప్పుడే చాలా దేశాలు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలిస్తుండటంతో కరోనా వైరస్‌ కట్టడికి సామాజిక దూరమే నివారణ మంత్రం కానుంది. టీకాలు, ఔషధాలు లేని ఈ కష్టకాలంలో దాన్ని పాటించడమే మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. ఆ ప్రాముఖ్యతను గుర్తించిన వ్యక్తులు, దేశాలు ఇప్పుడు తమ మెదడుకు పదును పెడుతున్నాయి. ఆ ఆలోచనలు కొన్ని నవ్వు తెప్పిస్తుండగా, మరి కొన్ని వావ్ అనిపిస్తున్నాయి. అవేంటో మీరూ చూడండి.

తల మీద నూడుల్స్: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నుంచి జర్మనీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. దాంతో తాము, తమ వినియోగదారులు సురక్షితంగా ఉండటానికి అక్కడి ఓ కేఫ్ వినూత్నంగా ఆలోచించింది. అత్యంత తేలికగా ఉండే స్విమ్మింగ్ పూల్‌ నూడుల్స్‌తో క్యాప్‌ను తయారు చేసి వచ్చిన కస్టమర్లకు అందిస్తోంది. ఆ నూడుల్స్‌ పొడవుగా ఉండటంతో ఆటోమెటిగ్గా ఎవరైనా సరే దూరం దూరంగా కూర్చోవాల్సిందే. ఆ కేఫ్ తన ఆలోచనను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు కేఫ్ యజమానులను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

చైనాలో హెడ్ గేర్: కరోనా వైరస్‌ పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో దాని ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. దాంతో అక్కడక్కడా పాఠశాలలు కూడా తెరుచుకుంటున్నాయి. అక్కడి ఓ నగరంలోని పాఠశాలలో విద్యార్థులు హెడ్ గేర్లు ధరించి ఉన్న చిత్రాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఆ ఆలోచనకు మూలం చైనీయులను పాలించిన సాంగ్ వంశంలోనే ఉంది. కోర్టు గదుల్లో అధికారులు ఒకరికొకరు చెవులు కొరుక్కోకుండా ఈ హెడ్ గేర్ల లాంటివే ధరించేవారట. 

 

సరుకులకు తనకు బదులుగా రోబో: తమిళనాడులో ఓ వ్యక్తి తనకు బదులుగా సరుకులు తెచ్చుకోవడానికి ఓ రోబోను వరసలో నిలబెట్టాడు. ఇంజనీరింగ్ చదివిన ఆ వ్యక్తి రూ.3,000 ఖర్చు పెట్టి నాలుగు చక్రాల రోబోను రూపొందించాడు. ఆ చక్రాల మీద ఓ అట్టపెట్టను పెట్టి సరుకులకు పంపాడు. 

 


 

సింగపూర్‌లో రోబో శునకం: బహిరంగ ప్రదేశాల్లో ప్రజలందరూ సామాజిక దూరం పాటించేలా చూసేందుకు సింగపూర్ అధికారులు రోబో శునకాన్ని కాపలా పెట్టారు. అక్కడి సెంట్రల్ పార్కులో జాగింగ్‌కి వచ్చేవారు, సైక్లింగ్ చేసేవారు తగినదూరం పాటించేలా ఈ శునకానికి బాధ్యతలు అప్పగించారు. కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కనీసం మూడు నుంచి ఆరు అడుగుల దూరం పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ప్రజలు ఈ వినూత్న ఆలోచనలు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని