Afghanistan crisis: అమెరికా.. మళ్లీ అదే తప్పు!

ఉగ్ర పోరులో పాకిస్థాన్‌ది ఎప్పుడూ వెన్నుపోటు ధోరణే. అమెరికాపై 9/11 దాడుల తర్వాత అల్‌ఖైదా..

Published : 05 Sep 2021 09:34 IST

అల్‌ఖైదా వేటలో పాక్‌ సాయాన్ని కోరుతున్న అగ్రరాజ్యం
 మా సేవలను గుర్తిస్తేనే.. అంటూ పాక్‌ మెలిక
 ఇరుదేశాల మధ్య జరిగిన రహస్య దౌత్య సంభాషణలు వెల్లడి

ఇస్లామాబాద్‌: ఉగ్ర పోరులో పాకిస్థాన్‌ది ఎప్పుడూ వెన్నుపోటు ధోరణే. అమెరికాపై 9/11 దాడుల తర్వాత అల్‌ఖైదా.. ఆ సంస్థకు ఆశ్రయమిస్తున్న తాలిబన్లను అంతమొందించడానికి సహకరిస్తామని అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించి వంచించింది. మద్దతిస్తున్నట్లు నటిస్తూనే.. తాలిబన్లకు, అల్‌ఖైదా అధిపతి ఒసామా బిన్‌లాడెన్‌కు తన దేశంలోనే ఆశ్రయమిచ్చి.. పోషించింది. నాడు నాటో దాడులకు చెల్లాచెదురైన తాలిబన్లు.. అఫ్గాన్‌ పగ్గాలు మళ్లీ చేజిక్కించుకునేంత శక్తిమంతంగా తయారయ్యారంటే కారణం పాకిస్థానే. ఇదంతా తెలిసి మళ్లీ పాకిస్థాన్‌ సాయాన్నే.. అమెరికా కోరుతోంది. గతంలో జరిగిన నమ్మక ద్రోహాన్ని మరిచి ఉగ్రపోరులో అండదండలందించాలని బేరసారాలు చేస్తోంది. ఈ మేరకు అమెరికా, పాక్‌ దౌత్యవేత్తల మధ్య జరిగిన ఇ-మెయిల్, ఇతర సంభాషణలను ఓ అమెరికా పత్రిక బహిరంగపరిచింది. ‘‘అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్న నేపథ్యంలో అల్‌ఖైదా, ఐసిస్‌-కె లాంటి ఉగ్రవాద సంస్థలపై పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా బైడెన్‌ యంత్రాంగం.. పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచుతోంది’’ అని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది.

ఎప్పట్లానే.. మొసలి కన్నీరు

అల్‌ఖైదా, ఐసిస్‌లపై పోరుకు సహకరించాలని అమెరికా చేసిన విజ్ఞప్తికి పాకిస్థాన్‌ సానుకూలంగా స్పందించింది. అయితే ఎప్పట్లానే మొసలి కన్నీరు కారుస్తూ...ఓ షరతు పెట్టింది. తాము క్లిష్టసమయాల్లో ఎన్నో విధాలుగా అమెరికాకు సాయం చేశామని, ఇటీవల అఫ్గాన్‌ నుంచి సైనికులు, శరణార్థుల తరలింపులోనూ అండగా నిలిచామని, అయినా తమను బైడెన్‌ ప్రభుత్వం గుర్తించడంలేదని అమెరికా అధికారుల ముందు వాషింగ్టన్‌లోని పాక్‌ రాయబారి అసాద్‌ మజీద్‌ ఖాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తరలింపు ప్రక్రియలో తాము కీలక పాత్ర పోషించినా, ఇటీవల వివిధ దేశాలకు ధన్యవాదాలు చెబుతూ అమెరికా చేసిన ప్రకటనలో తమ దేశం పేరును ప్రస్తావించలేదని ఫిర్యాదు చేశారు. తమ ప్రధాని ఇమ్రాన్‌ఖానంటే బైడెన్‌కు చిన్నచూపని, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్కసారి కూడా ఇమ్రాన్‌తో మాట్లాడలేదని పేర్కొన్నారు. తమ సేవలను బహిరంగంగా గుర్తిస్తే తాము ఉగ్ర పోరాటంలో అమెరికాకు సాయం చేస్తామని షరతు పెట్టారు. దీంతో సాయం చేసిన దేశాల జాబితాలో పాకిస్థాన్‌ పేరును కూడా జోడిస్తూ బుధవారం అమెరికా ఓ ప్రకటన విడుదల చేసింది.

వాళ్లు మారిపోయారు

ఈ దౌత్య సంభాషణల్లో తాలిబన్లను పాకిస్థాన్‌ వెనకేసుకొచ్చింది. తాలిబన్లు మంచోళ్లని, మారిపోయారని, శాంతి కాముకులని పేర్కొంది. అమెరికాకు, గత అఫ్గాన్‌ ప్రభుత్వానికి సాయం చేసిన వారిపై తాలిబన్లు  ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారంటూ అగ్రరాజ్యం చేసిన వ్యాఖ్యలను మజీద్‌ ఖాన్‌ కొట్టిపారేశారు. పౌరుల యోగక్షేమాలు తెలుసుకోవడానికే ఇంటింటికి తాలిబన్లు తిరుగుతున్నారని.. అంతే తప్ప ఎలాంటి ప్రతీకార దాడులు చేయడం లేదని  చెప్పుకొచ్చారు. అయితే మీరు చెబుతున్నదానికి, క్షేత్రస్థాయిలో తాలిబన్ల చర్యలకు పొంతన లేదని అమెరికా విదేశాంగ శాఖ అధికారి ఎర్విన్‌ మసింగ.. మజిద్‌కు చెప్పారు.

ఆ ఒక్కటి అడక్కు

అఫ్గాన్‌లో ఉగ్రవాద సంస్థలపై పోరాటానికి మద్దతిస్తామని చెప్పిన పాకిస్థాన్‌..అల్‌ఖైదా విషయంలో మాత్రం ఆచితూచి స్పందించింది. ఐసిస్‌-కె, ఇతర ఉగ్రవాద సంస్థల అణిచివేతకు సహకరిస్తామని చెప్పింది. ఐసిస్‌ను తాలిబన్లు కూడా శత్రువుగానే చూస్తున్నారని.. కాబట్టి ఈ విషయంలో వారి సహకారం కూడా లభిస్తుందన్న భరోసాను అగ్రరాజ్యానికిచ్చింది. అయితే అల్‌ఖైదా పేరు ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్త పడింది. అమెరికాపై 9/11 దాడుల అనంతరం అల్‌ఖైదాను అంతమొందించడానికి.. ఆ సంస్థ అధినేత బిన్‌లాడెన్‌ను హతమార్చడానికి అమెరికా అఫ్గాన్‌లో అడుగుపెట్టింది. అయితే లాడెన్‌ను తన దేశంలోని అబోటాబాద్‌లో చాన్నాళ్లు పాక్‌ దాచిపెట్టింది. చివరకు అమెరికా దళాలు.. పాక్‌కు సమాచారమివ్వకుండా దాడి చేసి లాడెన్‌ను హతమార్చాయి.

అఫ్గాన్‌ మహిళలపై బాష్పవాయు ప్రయోగం!

పురుషులతో సమానంగా తమకూ హక్కులు కల్పించాలంటూ ఆందోళన చేస్తున్న అఫ్గాన్‌ మహిళలను... తాలిబన్‌ ప్రత్యేక బృందం చెదరగొట్టింది. గాలిలోకి కాల్పులు జరిపింది. తాలిబన్లు తమపై బాష్ప వాయువును ప్రయోగించినట్టు ఆందోళనకారులు వెల్లడించారు. అఫ్గాన్‌ మహిళలు కొందరు కాబుల్‌లో శనివారం శాంతియుతంగా నిరసన మొదలు పెట్టారు. యద్ధంలో మృతిచెందిన అఫ్గాన్‌ సైనికులకు... రక్షణశాఖ కార్యాలయం వద్ద నివాళులు అర్పించి, బిగ్గరగా నినాదాలు చేశారు. ఆందోళనకారులు అక్కడి నుంచి అధ్యక్ష భవనం వద్దకు చేరుకోగా.. 12 మంది తాలిబన్లతో కూడిన ప్రత్యేక బృందం వారిని అడ్డగించి, గాలిలోకి కాల్పులు జరిపింది. దీంతో ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని