రక్తం అమ్ముకోవద్దు.. ప్రాసెసింగ్‌ ఫీజు మాత్రమే తీసుకోవాలి: డీసీజీఐ

అత్యవసర సమయాల్లో రోగులకు కావాల్సిన రక్తం సమకూర్చడంలో బ్లడ్‌బ్యాంకులు, ఆసుపత్రులు అధిక రుసుం వసూలు చేస్తున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Updated : 05 Jan 2024 05:57 IST

దిల్లీ: అత్యవసర సమయాల్లో రోగులకు కావాల్సిన రక్తం సమకూర్చడంలో బ్లడ్‌బ్యాంకులు, ఆసుపత్రులు అధిక రుసుం వసూలు చేస్తున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రక్తానికి వసూలుచేస్తున్న అన్నిరకాల ఫీజులను తొలగించాలని నిర్ణయించినట్లు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) వెల్లడించింది. రక్తం అమ్ముకోరాదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఆసుపత్రులు, బ్లడ్‌ బ్యాంకులు ఇకపై ప్రాసెసింగ్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని సూచించింది. ‘‘రక్తానికి అధికరుసుం వసూలు చేస్తున్న అంశంపై గతేడాది సెప్టెంబరులో నిర్వహించిన డ్రగ్స్‌ కన్సల్టేటివ్‌ కమిటీ 62వ సమావేశంలో అధికారులు పూర్తిస్థాయిలో చర్చలు జరిపారు. ‘రక్తం అమ్మకానికి కాదు’ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. దాన్ని సరఫరా మాత్రమే చేయాలని నిర్ణయించారు. బ్లడ్‌బ్యాంకులు ప్రాసెసింగ్‌ రుసుం ఒక్కటే వసూలుచేయాలని సిఫార్సు చేశారు’’ అని డీసీజీఐ తన లేఖలో పేర్కొంది. ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఔషధ నియంత్రణ విభాగాలకు తెలియజేసినట్లు తెలిపింది. తాజా మార్గదర్శకాల ప్రకారం రక్తం లేదా రక్త విభాగాలకు (ప్లాస్మా, తెల్లరక్తకణాల వంటివి) రూ.250 నుంచి రూ.1,550 వరకు మాత్రమే వసూలు చేయాలి. ఈ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ అధికారులను డీసీజీఐ ఆదేశించింది. బాధితుల తరఫున రక్తదానం చేయని పక్షంలో కొన్ని ఆసుపత్రులు, బ్లడ్‌బ్యాంకులు ఒక్కో యూనిట్‌ సరఫరాకు రూ.3,000 నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. రక్తం కొరత, అరుదైన గ్రూపు అవసరమైన సమయంలో ఈ ధర మరింత ఎక్కువ ఉంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని