రూ.350 లంచం కేసులో.. 24 ఏళ్ల క్రితం విధించిన శిక్షను కొట్టేసిన హైకోర్టు
రూ.350 లంచం తీసుకున్నట్లు నమోదైన కేసులో ఓ పోలీస్ అధికారికి దిగువ కోర్టు 24 ఏళ్ల క్రితం విధించిన ఏడాది జైలు శిక్షను బాంబే హైకోర్టు తాజాగా కొట్టివేసింది. ఫిర్యాదుదారు నుంచి అతడు తీసుకున్న సొమ్ము లంచమే అని
డబ్బు తీసుకున్నంత మాత్రాన అది లంచమే అని చెప్పలేమని వ్యాఖ్య
ముంబయి: రూ.350 లంచం తీసుకున్నట్లు నమోదైన కేసులో ఓ పోలీస్ అధికారికి దిగువ కోర్టు 24 ఏళ్ల క్రితం విధించిన ఏడాది జైలు శిక్షను బాంబే హైకోర్టు తాజాగా కొట్టివేసింది. ఫిర్యాదుదారు నుంచి అతడు తీసుకున్న సొమ్ము లంచమే అని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ధర్మాససం వ్యాఖ్యానించింది. దామూ అవ్హాడ్ అనే వ్యక్తి 1988లో సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు.. ఓ కేసులో నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి అతడి సోదరుడి నుంచి రూ.350 లంచంగా తీసుకున్నారన్నది అభియోగం. ఫిర్యాదుదారు మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు సమాచారమివ్వగా వారు వలపన్నారు. ఫిర్యాదుదారు నుంచి దామూ రూ.350 తీసుకోగానే రెడ్హ్యాండెడ్గా పట్టుకుని ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. 1998 ఆగస్టులో నాసిక్లోని ప్రత్యేక కోర్టు దామూను దోషిగా నిర్ధారించి ఏడాది జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ అదే ఏడాది దామూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సింగిల్ బెంచ్ గురువారం దామూకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఫిర్యాదుదారు నుంచి నిందితుడు స్వీకరించిన సొమ్మును రికవరీ చేసినంత మాత్రాన అతడు లంచం తీసుకున్నట్లు నిర్ధారించలేమని పేర్కొంది. ఫిర్యాదుదారును నిందితుడు లంచం కోసం డిమాండ్ చేసి తీసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉండాలని తెలిపింది. వాటిని ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.