supreme court: గోద్రా రైలు ఘటన దోషులకు బెయిల్‌ ఇవ్వొద్దు: గుజరాత్‌

గోద్రా రైలు దహనం కేసులో కొందరు దోషుల బెయిల్‌ పిటిషన్లను గుజరాత్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వ్యతిరేకించింది. వాళ్ల పిటిషన్‌లు 2017 అక్టోబర్‌లో గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపింది.

Published : 03 Dec 2022 17:56 IST

దిల్లీ: గోద్రా రైలు దహనం కేసు(Godhra Train Burning Case)లో కొందరు దోషుల బెయిల్‌ పిటిషన్లను గుజరాత్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టు (Supreme court)లో వ్యతిరేకించింది. వాళ్లు రాళ్లదాడికి పాల్పడటం వల్లే దగ్ధమవుతున్న కోచ్‌ నుంచి ప్రయాణికులు తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ తరఫు న్యాయవాది తుషార్‌ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి వివరించారు. 2002, ఫిబ్రవరి 27న గోద్రా రైల్వేస్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పంటించడంతో ఎస్‌-6 బోగీలోని 59 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కొందరు దోషులు తమకు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీ వై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీ ఎస్‌ నరసింహా  నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే వారు 17-18 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినందున వారి పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవచ్చన్న సుప్రీంకోర్టు.. దోషుల వ్యక్తిగత పాత్రలను పేర్కొనవలసిందిగా రాష్ట్రాన్ని కోరింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. దోషులు చేసింది సాధారణ రాళ్లదాడి కాదని, వీరివల్ల బోగీలోని ప్రయాణికులు బయటకు రాలేకపోయారని కోర్టుకు వివరించారు. మరోవైపు దోషుల బెయిల్‌ పిటిషన్లు 2017 అక్టోబర్‌లో గుజరాత్‌ హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 11 మందికి విధించిన మరణ శిక్షను గుజరాత్‌ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చిందని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. రైలు దహనంపై దోషుల వ్యక్తిగత పాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలపాల్సిందిగా గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను డిసెంబరు 15కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని