Vaccination: భారత్‌ రికార్డ్‌.. 100కోట్లు దాటిన డోసుల పంపిణీ..!

కరోనా మహమ్మారి కోరలు విరిచేందుకు భారత్ చేపట్టిన ‘టీకా మహోద్యమం’ నేడు కీలక ఘట్టానికి చేరుకుంది. బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమంలో ‘శతకోటి’ ప్రయాణాన్ని

Updated : 21 Oct 2021 10:32 IST

దిల్లీ: కరోనా మహమ్మారి కోరలు విరిచేందుకు భారత్ చేపట్టిన ‘టీకా మహోద్యమం’ నేడు కీలక ఘట్టానికి చేరుకుంది. బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమంలో ‘శతకోటి’ ప్రయాణాన్ని నిర్విగ్నంగా పూర్తిచేసింది. టీకా పంపిణీలో భారత్‌ నేడు 100కోట్ల మైలురాయిని అధిగమించింది. చైనా తర్వాత వంద కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్‌ కీర్తి గడించింది. 

దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఈ ఏడాది జనవరి 16న టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి దశలో భాగంగా కరోనా పోరులో ముందున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి, మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ వ్యాక్సిన్‌ వేయడం ప్రారంభించారు. 

వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైన తొలినాళ్లలో ప్రజల్లో నెలకొన్న భయాలు, ఇతరత్రా కారణాలతో టీకా పంపిణీ నెమ్మదిగా సాగింది. అయితే, ఈ ఏడాది మార్చి తర్వాత కరోనా రెండో దశ విజృంభిన తర్వాత నుంచి వ్యాక్సినేషన్‌ ఊపందుకుంది. జూన్‌ నెలాఖరులో రోజుకు 40లక్షల డోసులు పంపిణీ చేయగా.. ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబరు 17న ఒక్కరోజే ఏకంగా 2.5కోట్ల డోసులను అందించారు. అక్టోబరు 21న నాటికి 100కోట్ల డోసుల మార్క్‌ను దాటేసింది. 

చైనా తర్వాత మనమే..

ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల డోసులను పంపిణీ చేసిన రెండో దేశం భారత్‌ కావడం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి దేశం చైనా.. ఇప్పటికే అక్కడ డోసుల పంపిణీ 200కోట్లు దాటినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక అమెరికా, బ్రెజిల్‌, ఇండోనేషియా దేశాలు భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

31శాతం మందికి రెండు డోసులు పూర్తి..

కొవిన్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. గురువారం ఉదయం 9:47 గంటల సమయంలో డోసుల పంపిణీ 100కోట్లు దాటింది. అయితే ఇందులో ఎక్కువగా తొలి డోసు తీసుకున్నవారే. అధికారిక వర్గాల గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 75శాతం మంది అర్హులైన వారికి తొలి డోసు టీకా పూర్తవ్వగా.. దాదాపు 31శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. రెండు డోసులు పూర్తయిన వారి సంఖ్య తక్కువగా ఉండటంతో ఇకపై కేంద్రం రెండో డోసుపై దృష్టి పెట్టాలని ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది. 

టీకా పంపిణీలో భారత్‌ మైలురాళ్లను దాటిందిలా..

జనవరి 16: టీకా కార్యక్రమం ప్రారంభం

ఫిబ్రవరి 19: కోటి డోసులు

ఏప్రిల్ 11: 10 కోట్ల డోసులు 

జూన్‌ 12: 25 కోట్ల డోసులు

ఆగస్టు 6: 50 కోట్ల డోసులు

సెప్టెంబర్ 13:  75 కోట్ల డోసులు

అక్టోబర్ 21: 100 కోట్ల డోసులు



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని