Narendra Modi : ఆదివాసీ సేవలో విరిసిన ‘పద్మా’లు: మోదీ

ఈ ఏడాది పద్మా అవార్డుల్లో ఆదివాసులకు సేవ చేసిన వారికి ఎక్కువగా దక్కాయని ప్రధాని మోదీ అన్నారు. 2023 తొలి మన్‌కీ బాత్‌లో ఆయన మాట్లాడారు. 

Updated : 29 Jan 2023 14:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2023 సంవత్సరాన్ని ‘పీపుల్స్‌ పద్మ’ ఏడాదిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆయన 2023లో తొలి ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆదివారం మాట్లాడారు. ‘‘ఆదివాసీ వర్గాలకు లేదా ఆదివాసుల అభివృద్ధికి కృషి చేసిన వారికి ఈ సారి చెప్పుకోదగ్గ స్థాయిలో పద్మా అవార్డులు లభించాయి. సాధారణ నగర జీవితాలకు ఆదివాసీల జీవితాలు చాలా భిన్నంగా ఉంటాయి. వారికి భిన్నమైన సవాళ్లు ఎదురవుతాయి. కానీ, వారి సంస్కృతిని కాపాడుకొంటారు. చాలా మంది గొప్ప వ్యక్తులు ఆదివాసుల భాషలపై పరిశోధనలు చేసి పద్మా సత్కారాన్ని అందుకొన్నారు. ఇది మనందరికీ గర్వకారణం. సిద్ధి, జార్వా, ఆంగే జాతులతో కలిసి పనిచేసన వారికి కూడా ఈ సారి అవార్డులు లభించాయి. దీంతోపాటు నక్సలైట్‌ ప్రాంతాల్లో పద్మా ప్రతిధ్వనులు వినిపించాయి. అక్కడ దారితప్పిన యువతను సన్మార్గంలో నడిపిన వారికి కూడా ఇవి లభించాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

దేశంలో చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించేవారిని కూడా ప్రధాని అభినందించారు. ‘‘మనం ఎప్పుడైన మిల్లెట్‌ప్రెన్యూర్స్‌ అనేది విన్నామా..? ఒడిశాలో మిల్లెట్‌ప్రెన్యూర్స్ వార్తల్లో నిలిచారు. సుందర్‌గఢ్‌ జిల్లాలో ఒక మహిళా స్వయం సహాయక బృందం చిరుధాన్యాలను ఆ  రాష్ట్ర మిల్లెట్‌ మిషన్‌తో కలిసి పనిచేస్తోంది. వారు చిరుధాన్యాలతో బిస్కెట్లు, కేకులు, తినుబండారాలను తయారు చేసి విక్రయిస్తున్నారు’’ అని ప్రధాని మోదీ చెప్పారు.  ఆరోగ్య రంగంలో పెనుమార్పులు చోటు చేసుకొంటున్నాయన్నారు. యోగా డే, ఇయర్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ ప్రచారంలో ప్రజల భాగస్వామ్యాన్ని చూస్తే ఇది అర్థమవుతోందన్నారు. 

ఇ-వేస్ట్‌ పై ప్రధాని మాట్లాడుతూ నేటి అత్యాధునిక పరికరాలే రేపటి ఇ-వ్యర్థాలుగా మారతాయన్నారు. కొత్త పరికరాలు కొన్నప్పుడు పాతవాటిని సరైన పద్దతిలో వదిలించుకోవాలని సూచించారు. ఐరాస లెక్కల ప్రకారం 50 మిలియన్‌ టన్నుల ఇ-వేస్ట్‌ను ఎక్కడ పడితే అక్కడ పారేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని