Border: చైనా సరిహద్దుల్లో మరో 50 వేల మంది సైనికులు

ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాను ధీటుగా ఎదుర్కోవడమే లక్ష్యంగా భారత్‌ చర్యలు చేపడుతోంది. ఈమేరకు సరిహద్దుల వద్ద డ్రాగన్‌ చర్యల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా అదనంగా 50 వేల మంది సైనికుల్ని....

Published : 29 Jun 2021 01:38 IST

డ్రాగన్‌ ఆగడాలను అడ్డుకోవడమే లక్ష్యంగా మోహరింపులు

చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తొలగని వేళ భారత్ పూర్తి అప్రమత్తతను ప్రదర్శిస్తోంది. ఇదివరకు చైనా సైన్యాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఉన్న భారత్.. అవసరమైతే దాడి చేసేలా వనరులు పెంచుకుంటోంది. ఇందుకోసం అదనంగా 50 వేల మంది సైనికులను చైనా సరిహద్దుల వద్ద భారత్ మోహరించినట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. గతేడాది లెక్కలతో పోలిస్తే ఇప్పుడున్న దళాల సంఖ్య 40 శాతం అధికం. అటు సముద్ర జలాల్లోనూ చైనాపై నిఘా పెంచేందుకు భారత నావికాదళం సైతం చర్యలు చేపట్టింది.

దిల్లీ: ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాను ధీటుగా ఎదుర్కోవడమే లక్ష్యంగా భారత్‌ చర్యలు చేపడుతోంది. ఈమేరకు సరిహద్దుల వద్ద డ్రాగన్‌ చర్యల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా అదనంగా 50 వేల మంది సైనికుల్ని, యుద్ధ విమానాల్ని చైనా సరిహద్దుల వద్ద భారత్‌ మోహరించినట్లు ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. ప్రస్తుతం చైనా సరిహద్దుల్లో భారత సైనికులు 2 లక్షల మంది పహారా కాస్తున్నారు. ఇది 2020 నాటి లెక్కలతో పోలిస్తే 40 శాతం కన్నా అధికం. ఇదివరకు చైనా ఆగడాలను అడ్డుకోవడమే లక్ష్యంగా సైనిక మోహరింపులు ఉండేవి. అయితే ఆ విధానానికి స్వస్తి పలుకుతూ భారత్‌ ముందుకుసాగుతోంది. డ్రాగన్‌ సైన్యాన్ని అడ్డుకోవడమే కాకుండా.. అవసరమైతే దాడి చేసేలా భారత్‌ వ్యవహరిస్తోందని బ్లూమ్‌బర్గ్‌ ఓ నివేదికలో పేర్కొంది.

సరిహద్దుల్లోకి మరిన్ని బలగాలను మోహరించడం ద్వారా.. హిమాలయాల్లో చైనాను ఢీకొట్టేలా సైనికులు అలవాటు పడేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రవేశపెట్టిన రఫేల్‌ సహా, ఫైటర్‌ జెట్లను సైతం చైనా సరిహద్దు వెంబడి మూడు విభిన్న ప్రాంతాలకు తరలించారు. సముద్ర మార్గం గుండా చైనా నుంచి బయటకొచ్చే వనరులు, వాణిజ్య పరమైన అంశాలపై నిఘా ఉంచేందుకు భారత నావికాదళం సైతం యుద్ధ నౌకల్ని మోహరిస్తోంది. గల్వాన్‌ లోయలో గతేడాది జరిగిన ఘర్షణ అనంతరం డ్రాగన్‌ను ఎదుర్కొనేందుకు ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చైనా వ్యూహాత్మక ఎత్తుగడలు, భవిష్యత్తులో ఆ దేశం నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత నిర్ణయం దోహదం చేస్తుందని సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసర్చ్‌ సీనియర్‌ సభ్యుడు, యేల్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ సుశాంత్‌సింగ్‌ అన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ కథనం పేర్కొంది.

ప్రస్తుతం భారత్‌తో సరిహద్దుల వెంట చైనా సైన్యం ఎంతమంది ఉన్నారన్నదానిపై స్పష్టత లేదు. అయితే సరిహద్దుల వెంట మోహరించిన దళాలు, కార్యకలాపాల్ని చైనా పెంచినట్లు భారత్‌ గుర్తించింది. కొత్త రన్‌వేలు, ఎయిర్‌ ఫీల్డులు, బంకర్ల నిర్మాణం సహా ట్యాంకులు, ఫైటర్‌ జెట్‌లను చైనా మోహరిస్తోంది. కొన్ని నెలలుగా దీర్ఘశ్రేణి ఫిరంగి, ట్యాంకులు, రాకెట్‌ రెజిమెంట్లు, ట్విన్‌ ఇంజిన్‌ ఫైటర్లను చైనా మోహరించినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది. ఇరు దేశాలు ఇదే తీరులో ఎక్కువ సంఖ్యలో బలగాలను మోహరించడం ప్రమాదమని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని