Jammu kashmir: ‘నన్ను గృహ నిర్బంధం చేశారు’

తనను గృహ నిర్బంధం చేశారంటూ జమ్మూ- కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మంగళవారం ట్వీట్‌ చేశారు. ఇటీవల కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు సయ్యద్‌ అలీ షా గిలానీ మృతదేహంపై పాక్‌ జాతీయ పతాకాన్ని కప్పడం...

Updated : 07 Sep 2021 23:19 IST

శ్రీనగర్‌: తనను గృహ నిర్బంధం చేశారంటూ జమ్మూ- కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మంగళవారం ట్వీట్‌ చేశారు. ఇటీవల కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు సయ్యద్‌ అలీ షా గిలానీ మృతదేహంపై పాక్‌ జాతీయ పతాకాన్ని కప్పడం, దేశ వ్యతిరేక నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో స్థానిక బుడ్గాం పోలీసులు.. గిలానీ కుటుంబ సభ్యులపై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీన్ని విమర్శిస్తూ ముఫ్తీ ఆదివారం కేంద్రంపై విరుచుకుపడ్డారు. ‘కశ్మీర్‌ను ఇప్పటికే బహిరంగ జైలుగా మార్చారు. ఇప్పుడు చనిపోయిన వారినీ విడిచిపెట్టలేదు. గిలానీ కుటుంబ సభ్యులపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడమనేది.. కేంద్ర ప్రభుత్వ నిర్దయను చూపుతోంది’ అని విమర్శలు చేశారు. ఇది జరిగిన రెండు రోజులకే హౌస్‌ అరెస్ట్‌పై ముఫ్తీ ట్వీట్‌ చేయడం చర్చనీయాంశమైంది. ‘కేంద్ర ప్రభుత్వం అఫ్గాన్‌వాసుల హక్కులపై ఆందోళన వ్యక్తం చేసింది. కానీ, కశ్మీర్‌ ప్రజల విషయంలో మాత్రం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ రోజు నన్ను గృహ నిర్బంధంలో ఉంచారు. ఎందుకంటే.. కేంద్రం ప్రకారం ఇక్కడ పరిస్థితులు సాధారణంగా లేవు. అంటే.. ఇక్కడంతా నార్మల్‌గానే ఉందని వారు చెప్పేదంతా అబద్ధమే అన్న విషయాన్ని ఇది తేటతెల్లం చేస్తోంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. శ్రీనగర్‌లోని తన నివాసం గేటును బ్లాక్‌ చేసిన దృశ్యాలను ట్వీట్‌కు జతచేశారు. గత బుధవారం గిలానీ మృతి అనంతరం లోయలో భద్రత కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని