
CBSE: పరీక్షలపై మోదీ నేడు కీలక భేటీ
దిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం కీలక భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పరీక్షల నిర్వహణపై ఇటీవల కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి అభిప్రాయాలు సేకరించిన విషయం తెలిసిందే. ఆ వివరాలను, పరీక్షల నిర్వహణకు ఉన్న అవకాశాలను అధికారులు మోదీకి వివరించనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను ఎలాగైనా నిర్వహించాలని భావిస్తున్న కేంద్రం ఇటీవల ఈ విషయమై అన్ని రాష్ట్రాలతో చర్చించింది. అన్ని సబ్జెక్టులకు కాకుండా కేవలం ముఖ్యమైన కొన్నింటికి నిర్వహిస్తే బాగుంటుందని, పరీక్షా సమయాన్ని తగ్గించాలని పలు రాష్ట్రాలు సూచించాయి. ఈ అభిప్రాయాలను పరిశీలించిన కేంద్రం.. త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.
సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే పరీక్షలను నిర్వహించాలా వద్దా అన్నదానిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం కోర్టుకు తెలిపింది. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది. మరోవైపు ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.