Cheetah: నాలుగు కూనలకు జన్మనిచ్చిన నమీబియన్‌ చీతా

భారత్‌లో చీతాల సంతతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతా (Project cheetah)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు కూనలకు జన్మనిచ్చింది. దీంతో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత భారత్‌ గడ్డపై చీతాలు జన్మించాయి.

Updated : 29 Mar 2023 20:46 IST

భోపాల్‌:  ప్రాజెక్ట్‌ చీతా (Project cheetah) లో భాగంగా నమీబియా (Namibia) నుంచి గతేడాది భారత్‌ (India)కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు.  ‘‘ శుభాకాంక్షలు, వన్యప్రాణుల సంరక్షణలో చారిత్రాత్మకమైన క్షణం. గతేడాది సెప్టెంబరు 17న నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు కూనలకు జన్మనిచ్చింది’’ అని వీడియో/ఫొటోను మంత్రి ట్విటర్‌లో షేర్ చేశారు.  దీంతో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత భారత్‌ గడ్డపై చీతాలు జన్మించడం విశేషం.

భారత్‌లో చీతాల సంతతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతా (Project cheetah)ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి విడతలో భాగంగా  గతేడాది నమీబియా నుంచి భారత్‌కు ఎనిమిది చీతాలను తీసుకొచ్చారు. వాటిని ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని శ్యోపూర్‌ జిల్లాలోని కునో జాతీయ పార్కు (Kuno National Park)లోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. వీటిలో సాశా అనే  ఆడ చీతా ఇటీవలే అనారోగ్యంతో మృత్యువాత పడింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో అది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. 

సాశా మృతి చెందిన రెండు రోజుల్లోనే మరో చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. మిగిలిన ఏడు చీతాలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయని తెలిపారు. రెండో విడతలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన 12 చీతాలు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఆరోగ్యంగా ఉన్నాయని ఫారెస్ట్ అధికారి జేఎస్‌ చౌహాన్‌ తెలిపారు. మనదేశంలోని చివరి చిరుత 1947లో ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో వేటకు బలైంది. ఈ క్రమంలో దేశంలో చీతాలు పూర్తిగా అంతరించిపోయినట్లు భారత ప్రభుత్వం 1952లో అధికారికంగా ప్రకటించింది. అంతరించి పోయిన చీతాల సంతతిని పునరుద్ధరించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్‌ చీతాను ప్రారంభించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని