Priyanka Gandhi: అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగిన సోనియా.. ప్రియాంక ఎమోషనల్‌ పోస్ట్‌

సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగిన సోనియా గాంధీ ఆ పదవి నుంచి వైదొలిగారు. సోనియా గాంధీకి కాంగ్రెస్‌ పార్టీ సైతం ఘనంగా వీడ్కోలు పలికింది.

Published : 27 Oct 2022 01:57 IST

దిల్లీ: సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగిన సోనియా గాంధీ ఆ పదవి నుంచి వైదొలిగారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన మల్లికార్జున ఖర్గేకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఖర్గే.. సోనియాకు రాజీవ్‌ గాంధీ చిత్రాన్ని బహూకరించారు. దాన్ని సోనియా గాంధీ పైకెత్తి చూపిస్తూ ఆనందం వ్యక్తంచేశారు. ఈ చిత్రాన్ని ప్రియాంక గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ .. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉందమ్మా! ప్రపంచం ఏమనుకున్నా.. ఏం ఆలోచించినా సరే. నాకు తెలుసు ఇదంతా కేవలం ప్రేమ కోసమే చేశావ్‌ అని!’’ అంటూ రాసుకొచ్చారు.

సోనియా గాంధీకి కాంగ్రెస్‌ పార్టీ సైతం ఘనంగా వీడ్కోలు పలికింది. పార్టీ తరఫున ఆ పార్టీ నేత అజయ్‌ మాకెన్‌ వీడ్కోలు ప్రకటనను చదివి వినిపించారు. దేశం పట్ల ఆమెకున్న ప్రగాఢమైన ప్రేమ నుంచి ఆమె తన రాజకీయ స్ఫూర్తి పొందారని, ప్రజలు కూడా అదే ప్రేమ, అదే నమ్మకాన్ని ఆమెకు తిరిగి ఇచ్చారని పేర్కొన్నారు. పార్టీలో తన జోక్యం ద్వారా అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా మారేలా పార్టీని తీర్చిదిద్దారని కొనియాడారు. క్లిష్టమైన పరిస్థితుల్లో, దూరదృష్టితో ఆమె తీసుకున్న నిర్ణయాలు పార్టీ భవిష్యత్‌కు పునాది వేశాయని ప్రశంసించారు.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా 1998 నుంచి 2017 వరకు సోనియా పనిచేశారు. 2019 నుంచి నిన్నటిదాక పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగారు. 1991లో తన భర్త రాజీవ్‌ గాంధీ మరణించే సమయానికి సోనియా గాంధీ రాజకీయాలకు ఆమడ దూరంగా ఉండేవారు. కానీ, పరిస్థితుల ప్రభావం కారణంగా 1997లో తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ మరుసటి ఏడాదే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ కాలంలోనే కాంగ్రెస్‌ పార్టీ అనేక ఎత్తుపల్లాలను చవిచూసింది. 2004 నుంచి 2014 వరకు దేశంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. గడిచిన 8 ఏళ్లుగా ప్రతిపక్షంలో కొనసాగుతోంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని