కొవిడ్‌ మరణాల తగ్గింపు ఆరోపణలపై కేంద్రంకౌంటర్‌

దేశంలో కరోనా కేసులు, మరణాలను తగ్గించి చూపిస్తున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ స్పందించారు. కొవిడ్‌ మరణాల రిజిస్ట్రేషన్‌ రాష్ట్రాలే......

Updated : 20 Jul 2021 20:42 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసులు, మరణాలను తగ్గించి చూపిస్తున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ స్పందించారు. కొవిడ్‌ మరణాల రిజిస్ట్రేషన్‌ను రాష్ట్రాలే చేస్తున్నాయన్నారు. మరణాలు, కేసులను తక్కువగా నమోదు చేయాలని ఏనాడూ రాష్ట్రాలకు చెప్పలేదని స్పష్టంచేశారు. గత రెండు దశల అనుభవాలను బట్టి చూస్తే కరోనా థర్డ్‌ వేవ్‌ చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుందనడం సరికాదన్నారు. మంగళవారం ఆయన రాజ్యసభలో కరోనా నియంత్రణపై జరిగిన లఘు చర్చ సందర్భంగా మాట్లాడారు.

దేశంలో వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు తమ టీకాల ఉత్పత్తిని పెంచుతున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌ తయారుచేసిన తొలి దేశంగా భారత్‌ నిలవనుందన్నారు. వ్యాక్సిన్‌ సాంకేతికత కొన్ని కంపెనీలకు బదిలీ జరిగిందని, రాబోయే రోజుల్లో వ్యాక్సిన్‌ కొరతను తగ్గించడమే లక్ష్యంగా ఉత్పత్తి ప్రారంభిస్తాయని పేర్కొన్నారు. క్యాడిలా సంస్థ తయారు చేస్తున్న డీఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌ మూడో దశ ట్రయల్స్‌ పూర్తయిందన్నారు. దీంతో ఆ సంస్థ అత్యవసర వినియోగం కోసం డీసీజీఏ వద్ద దరఖాస్తు చేసుకుందని పేర్కొన్నారు. నిపుణుల బృందం దీన్ని పరిశీలిస్తోందని చెప్పారు. 

సీరమ్‌ సంస్థ నెలకు 11 నుంచి 12 కోట్ల డోసులు తయారు చేస్తుండగా.. భారత్‌ బయోటెక్‌ సంస్థ ఆగస్టు నెలలో 3.5కోట్ల టీకాలు పంపిణీ చేస్తుందని మంత్రి వెల్లడించారు. బయోలాజికల్‌ మూడో దశ ప్రయోగాలు చేస్తోందని, ఈ టీకా సెప్టెంబర్‌- అక్టోబర్‌ నాటికి 7.5కోట్ల డోసులు వస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. జైడస్‌ క్యాడిలా, భారత్‌ బయోటెక్‌ సంస్థలు చిన్న పిల్లలపై ట్రయల్స్‌ ప్రారంభించాయని తెలిపారు. ఆ ట్రయల్స్‌ విజయవంతమవుతాయని విశ్వాసం వ్యక్తంచేశారు. మన దేశీయ కంపెనీలు, శాస్త్రవేత్తలపై విశ్వాసం ఉంచాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తుచేశారు.  ప్రభుత్వం చెబుతున్నట్టుగా దేశంలో 4-5లక్షల కొవిడ్‌ మరణాలు అనేది అవాస్తవమని రాజ్యసభలో కాంగ్రెస్‌ సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు  మరణాలు 52.4లక్షల కన్నా తక్కువేమీ ఉండవని వ్యాఖ్యానించడంపై కేంద్ర ఆరోగ్యమంత్రి పైవిధంగా సమాధానం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని