13 హెలికాప్టర్లతో కొనసాగుతున్న గాలింపు 

ఇండోనేసియాలో 62మంది ప్రయాణికులతో ఇటీవల అదృశ్యమైన విమానం సముద్రంలో కూలిపోవడం పెను విషాదం రేపింది. ఈ ఘోర ప్రమాదంలో బాధితులు, విమాన శకలాలను......

Published : 15 Jan 2021 03:49 IST

 4100 సిబ్బందిని రంగంలోకి దించిన ఇండోనేషియా ప్రభుత్వం

జకార్తా: ఇండోనేసియాలో 62మంది ప్రయాణికులతో ఇటీవల అదృశ్యమైన విమానం సముద్రంలో కూలిపోవడం పెను విషాదం నింపింది. ఈ ఘోర ప్రమాదంలో మృతులు, విమాన శకలాలను గుర్తించేందుకు ప్రభుత్వం అన్వేషణ కొనసాగిస్తోంది. శ్రీవిజయ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్‌ ఫ్లైట్‌ నుంచి విడిపోయిన కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ కోసం డైవర్లు  థౌజెండ్‌ ఐలాండ్‌లోని జావా సముద్ర తీర ప్రాంతాల్లో గాలింపును మరింత ముమ్మరం చేశారు. మరోవైపు, మంగళవారం రోజున విమానం డేటాతో ఉన్న బ్లాక్‌ బాక్స్‌ లభ్యమైంది. ఇప్పటికే కొన్ని విమాన శకలాలు, మానవ అవశేషాలను కూడా సహాయక సిబ్బంది గుర్తించారు. 

ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో వైమానిక అన్వేషణను మరింతగా పెంచినట్టు రెస్క్యూమిషన్‌ సమన్వయకర్త రస్‌మాన్‌ తెలిపారు. తద్వారా సముద్ర ప్రవాహంలో విమాన శిథిలాలు, బాధితులను గుర్తించే వీలుంటుందని తెలిపారు. గాలింపు చర్యల కోసం 4100 మంది సహాయక సిబ్బంది, 13 హెలికాఫ్టర్లు, 55 ఓడలు, 18 రాఫ్ట్ బోట్‌లను రంగంలోకి దించినట్టు నేవీ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 141 మానవ అవశేషాలతో కూడిన బ్యాగులను పోలీస్‌ ఐడెంటిఫికేషన్‌ ఎక్స్‌పర్ట్‌లకు పంపారు. అలాగే, ప్రభుత్వం విపత్తు బాధిత గుర్తింపు కేంద్రం ఏర్పాటు చేయగా..  బాధితుల కుటుంబ సభ్యులు డీఎన్‌ఏ శాంపిల్స్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు ఫ్లైట్‌ అటెండెంట్‌, ఆఫ్‌ డ్యూటీ పైలట్‌తో పాటు మొత్తం ఆరుగురి మృతదేహాలను గుర్తించినట్టు ఆ కేంద్రం అధికారులు తెలిపారు. ఫ్లైట్‌ అటెండెంట్‌ ఒక్కే బిస్మా (29) అంత్యక్రియలను గురువారం నిర్వహించారు.  కరోనా నేపథ్యంలో మాస్క్‌లు ధరించి.. భౌతికదూరం పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. 

ప్రమాదానికి గురైన బోయింగ్‌ 737-500 విమానంలో ఇద్దరు పైలట్‌లూ విమానాలను నడపడంలో విశేష అనుభవం ఉన్నవారేనని శ్రీవిజయ విమానయాన సంస్థ తెలిపింది. కెప్టెన్‌ అఫ్వాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెర్క్యులెస్‌ పైలట్‌గా తన కెరీర్‌ ప్రారంభించారని, కొన్ని దశాబ్దాల అనుభవం ఆయనకు ఉందని పేర్కొంది. అలాగే, కో-పైలట్‌ డియాగో మమహిట్‌కు కూడా అంతే అనుభవం ఉందని తెలిపింది. 

ఇవీ చదవండి..

ఆశలు జలసమాధి

ఆ ద్వీపాలు విమానాలకు శాపమా..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని