Dr Sharda Suman: అమ్మ ఓడిపోయింది..! 

పాలుగారే పసికందును పొత్తిళ్లలోకి తీసుకునే అదృష్టానికి ఆ తల్లి నోచుకోలేదు. మహమ్మారి రూపంలో ఎడబాటు ఎదురైంది. వృత్తే పరమావధిగా భావించి నిండు గర్భిణీనని

Updated : 07 Sep 2021 15:39 IST

పుట్టిన బిడ్డను చూసుకోకుండానే కరోనాతో పోరాడి ఓడిన వైద్యురాలు

కొవిడ్‌ రోగులకు సేవలందించి..మహమ్మారికి బలైన డాక్టర్‌

హైదరాబాద్‌: పాలుగారే పసికందును పొత్తిళ్లలోకి తీసుకునే అదృష్టానికి ఆ తల్లి నోచుకోలేదు. మహమ్మారి రూపంలో ఎడబాటు ఎదురైంది. వృత్తే పరమావధిగా భావించి నిండు గర్భిణీనని కూడా మరచి కరోనా రోగులకు సేవలందించిన వైద్యురాలు అదే వైరస్‌ బారిన పడటంతో ఆరోగ్యం క్షీణించింది. ఆ విషమ పరిస్థితుల్లోనే బిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. నవమాసాలు మోసిన తన చంటిపాపను కళ్లారా చూసుకోకుండానే చికిత్స కోసం దూరమైంది. ఎలాగైనా తాను కోలుకోవాలని, తన చిన్నారి చిట్టి చేతులు పట్టుకుని ఆడుకునే క్షణాల కోసం ఎదురుచూసిన ఆ అమ్మ ఆశ అడియాసే అయ్యింది. విధి ఆడిన వింత ఆటలో ఆమె ఓడిపోయింది. భూమ్మిదకు వచ్చినప్పటి నుంచి తల్లి స్పర్శ కోసం పరితపిస్తోన్న నాలుగు నెలల పసికందు ఏడుపు ఇక అరణ్య రోదనే అయ్యింది. కొవిడ్‌ బారిన పడి ఆరోగ్యం విషమించిన పరిస్థితిలో బిడ్డకు జన్మనిచ్చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన వైద్యురాలు.. 140 రోజులు మృత్యువుతో పోరాడి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

యూపీకి చెందిన 32ఏళ్ల డాక్టర్‌ శారదా సుమన్‌.. లఖ్‌నవూలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో రెసిడెంట్‌ డాక్టర్‌గా పనిచేసేవారు. భర్త అజయ్‌ కుమార్‌ కూడా వైద్యుడే. ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా రెండో దశ విజృంభణ సమయంలో ఆమె ఎంతోమంది కరోనా రోగులకు చికిత్స చేసి ఇళ్లకు పంపారు. వృత్తినే దైవంగా నమ్మే ఆమె.. నిండు గర్భిణీ అయినా జాగ్రత్తలు తీసుకుంటూనే రోగులకు సేవలందించి ప్రశంసలు పొందారు. ఇలా సాఫీగా సాగుతున్న ఆమె జీవితంపై కరోనా రక్కసి పగబట్టింది.

ఏప్రిల్‌ 14న శారద కొవిడ్‌ బారినపడ్డారు. అప్పటికి ఆమె 8 నెలల గర్భవతి. వారం పాటు ఆరోగ్యం సవ్యంగానే ఉన్నా.. తర్వాత విషమించింది. వెంటిలేటర్‌ సాయంతో చికిత్స అందించారు. తర్వాత ఊపిరితిత్తుల్లో గడ్డలు(ఫైబ్రోసిస్‌) వచ్చినట్లు గుర్తించారు. మే 1న అత్యవసర శస్త్రచికిత్స చేసి పురుడుపోశారు. పండంటి ఆడబిడ్డ పుట్టింది. అప్పటికే శారద ఆరోగ్యం విషమించడంతో ఎక్మో సాయంతో ఊపిరి అందించారు. కళ్లు తెరిచి బిడ్డను కళ్లారా చూసుకునే పరిస్థితిలో కూడా ఆమె లేదు.

రోజురోజుకీ ఆమె పరిస్థితి క్షీణించడంతో వైద్యులు ఆమెకు ఊపిరితిత్తులు మార్చాలని నిర్ణయించారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చికిత్స కోసం రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. ఊపిరితిత్తుల మార్పిడి కోసం జులై 11న ఎయిర్‌ అంబులెన్సులో లఖ్‌నవూ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్చి చికిత్స ప్రారంభించారు.

ఊపిరితిత్తుల మార్పిడి కోసం అన్ని పరీక్షలు చేశారు. అయితే ఆమె శ్వాసనాళం, అన్నవాహికలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దీని వల్ల నోటి ద్వారా ఆమెకు అందించే ఆహారం, ద్రవాలు నేరుగా ఊపిరితిత్తులకు వెళ్లిపోయాయి. దీని వల్ల ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స ఆలస్యమవుతూ వచ్చింది. చికిత్సకు స్పందిస్తుందేమోనని వైద్యులు ఎదురుచూసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి డాక్టర్ శారద కన్నుమూసినట్లు కిమ్స్‌ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శారద కుమార్తె వయసు ఇప్పుడు నాలుగు నెలలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని