
Covid-19: సాయుధ బలగాల్లో 70వేల మందికి కరోనా..!
ఇప్పటివరకు 190 మంది మరణించారన్న కేంద్ర ప్రభుత్వం
దిల్లీ: కొవిడ్-19 మహమ్మారితో వణికిపోయిన భారత్లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 3 కోట్ల 40లక్షల మంది వైరస్ బారినపడి కోలుకున్నారు. ఇదే సమయంలో సాయుధ బలగాల్లోనే 70 వేల మంది సిబ్బందికి వైరస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 190 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. సాయుధ బలగాల్లో కొవిడ్ కేసులపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు రక్షణశాఖ సహాయమంత్రి అజయ్ భట్ ఈ సమాధానమిచ్చారు.
దేశంలో వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు సాయుధ బలగాల్లో మొత్తం 70 వేల మందికి వైరస్ సోకగా.. ఇండియన్ ఆర్మీలో అత్యధికంగా 45,576 మంది సైనికులు వైరస్ బారినపడ్డారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 14,022 సిబ్బంది, ఇండియన్ నేవీలో 7,747 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి వెల్లడించారు. వైరస్ సోకిన మొత్తం సాయుధ బలగాల్లో ఇప్పటివరకు 190 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. వీరిలో ఇండియన్ ఆర్మీలోనే 137 మంది చనిపోగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 49 మంది, ఇండియన్ నేవీలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
అయితే, విధుల్లో ఉన్న సమయంలో ఎవరైనా ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాలు కోల్పోయినట్లయితే ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం వారికి ప్రత్యేకంగా ఎటువంటి పరిహారం లభించే అవకాశం లేదని కేంద్ర రక్షణశాఖ వెల్లడించింది. అయినప్పటికీ విధుల్లో ఉన్న సమయంలో మరణానంతరం సాధారణంగా వచ్చే ప్రయోజనాలను మాత్రం పొందుతారని తెలిపింది. వీటికి అదనంగా జాతీయ విపత్తు నిర్వహణ సాధికార సంస్థ (NDMA) మార్గదర్శకాల ప్రకారం రూ.50వేల కొవిడ్ పరిహారం అందుతుందని పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.