Apps: ఆకతాయిల వికృత చేష్టలు.. ఆ యాప్‌పై నిషేధం!

‘బుల్లీ బాయ్‌’ పేరిట యాప్‌ను సృష్టించి వికృత పనులకు పాల్పడుతున్న దుండగులపై సోషల్‌ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు....

Updated : 02 Jan 2022 11:37 IST

దుండగులపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

దిల్లీ: అందివచ్చిన సాంకేతికతను అవకాశంగా మార్చుకోవాల్సింది పోయి.. ఆకతాయిలు కంపరం పుట్టించే చేష్టలకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకొని వారు సృష్టిస్తున్న అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. ఏకంగా మనుషుల్నే యాప్‌లలో అమ్మకానికి పెట్టి అల్లరిపాలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ‘బుల్లీ బాయ్‌’ పేరిట యాప్‌ను సృష్టించి వికృత పనులకు పాల్పడుతున్న దుండగులపై సోషల్‌ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.

శిససేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కావాలనే దుండగులు వేలం పేరిట ఓ వర్గానికి చెందిన మహిళల ఫొటోలు యాప్‌లో పెట్టి అల్లరిపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని ముంబయి పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. వందలాది మంది మహిళల చిత్రాలు యాప్‌లో ఉన్నట్లు సమాచారం. తన ఫొటోను కూడా దుండగులు యాప్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు ఓ మహిళా జర్నలిస్టు దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ఇటు ముంబయితో పాటు దిల్లీ పోలీసులు స్పందించారు. తమకు అందిన ఫిర్యాదులపై విచారణ ప్రారంభించామని తెలిపారు. మరోవైపు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సైతం దీనిపై స్పందించారు. బుల్లీ బాయ్‌ యాప్‌, సైట్‌ను తొలగించినట్లు వెల్లడించారు. పోలీసులు సహా ఇతర సంబంధిత యంత్రాంగం దీనిపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నారని ట్విటర్‌లో పేర్కొన్నారు. మంత్రి సమాధానంపై స్పందించిన ప్రియాంక చతుర్వేది.. ఇంతటితో ఆగకుండా కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ కార్యాలయాలు దుండగులను కనిపెట్టడంలో సహకరించాలని కోరారు.

సామాజిక మాధ్యమాల నుంచి సేకరించిన కొన్ని ఫొటోలను దుండగులు బుల్లీ బాయ్‌ యాప్‌లో ఉంచుతున్నారు. ప్రత్యేకంగా ఓ వర్గానికి చెందిన మహిళల చిత్రాలను మాత్రమే ఉంచుతుండడం ఆందోళనకు దారితీస్తోంది. ఆరు నెలల క్రితం కూడా ‘సలీ డీల్స్‌’ పేరిట ఓ యాప్‌ ఇదే తరహా కార్యకలాపాలకు ఒడిగట్టింది. దీనిపై అప్పట్లో దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు దుండగులను మాత్రం గుర్తించలేకపోయారు. ఈ వివాదాస్పద యాప్‌లను దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు చెందిన ‘గిట్‌హబ్‌’ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నారు. దీంతో ఈ విషయంపై కేంద్రం గిట్‌హబ్‌కు సమాచారం అందించింది. పటిష్ఠ చర్యలు చేపట్టాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని