కథ కుదిరే.. కలయిక అదిరే

వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నా.. మరో మంచి కథ దొరికితే చాలు పచ్చజెండా ఊపేయాలని కొందరు. సినీ డైరీ ఖాళీ అయ్యేలోపు ఓ కొత్త కబురు వినిపించాలని మరికొందరు.. ఇలా కథానాయకులంతా కథల వేటలో తలమునకలై ఉన్నారు.

Published : 11 Nov 2022 06:40 IST

వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నా.. మరో మంచి కథ దొరికితే చాలు పచ్చజెండా ఊపేయాలని కొందరు. సినీ డైరీ ఖాళీ అయ్యేలోపు ఓ కొత్త కబురు వినిపించాలని మరికొందరు.. ఇలా కథానాయకులంతా కథల వేటలో తలమునకలై ఉన్నారు. ఇందులో కొన్ని ప్రాజెక్ట్‌లు ఇప్పటికే పక్కా అయినట్లు సమాచారం. అవి త్వరలోనే కార్యరూపంలోకి రానున్నట్లు తెలుస్తోంది.


నాని రొమాంటిక్‌ కామెడీ

కొత్త ప్రతిభను.. కొత్త కథల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు కథానాయకుడు నాని. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘దసరా’ ఇలాంటి ప్రయత్నమే. ఈ సినిమాతో శ్రీకాంత్‌ ఓదెల అనే కొత్త దర్శకుడ్ని తెరకు పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత నాని చేయనున్న కొత్త చిత్రం సైతం ఓ నూతన దర్శకుడే రూపొందించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొన్ని వెబ్‌సిరీస్‌లతో నిరూపించుకున్న శౌర్య అనే దర్శకుడు నానికి ఓ కథ వినిపించారని.. అది ఆయనకు నచ్చడంతో సినిమా చేసేందుకు అంగీకరించారని సమాచారం. ఇదొక భిన్నమైన రొమాంటిక్‌ కామెడీ చిత్రంలా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీన్ని చెరుకూరి మోహన్‌ నిర్మించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయని, ‘దసరా’ పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కుతుందని ప్రచారం వినిపిస్తోంది.


ఈనెలలోనే శ్రీకారం..

నాగచైతన్య కథానాయకుడిగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత చైతూ చేయనున్న చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు. ఆయన కోసం పరశురామ్‌ ఓ కథ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపించినా.. ఆ తర్వాత దానిపై స్పష్టత రాలేదు. దీనికి తోడు ఇటీవల ఆయన బాలకృష్ణకు ఓ కథ వినిపించనున్నట్లు చెప్పడంతో చైతన్యతో సినిమా లేకపోవచ్చని ప్రచారం వినిపించింది. అయితే ఇప్పుడు నాగచైతన్య - పరశురామ్‌ల ప్రాజెక్ట్‌ ఖరారైనట్లు సమాచారం. దీన్ని 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై నిర్మించనున్నారు. వెంకట్‌ ప్రభు సినిమా పూర్తి కాగానే ఈ చిత్రం రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.


శర్వా సిద్ధమే

‘ఒకే ఒక జీవితం’ విజయం శర్వానంద్‌కు కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఈ జోష్‌లోనే ఆయన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కించారు. కానీ, అనూహ్యంగా ఆ చిత్రం ఆగిపోవడంతో మళ్లీ కథల వేటలో పడ్డారు శర్వా. ఈ క్రమంలోనే ఇప్పుడాయన ఓ కథకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. ‘భలే మంచి రోజు’, ‘దేవదాస్‌’, ‘హీరో’ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య. ఆయన ఇటీవలే శర్వానంద్‌కు ఓ కొత్తదనం నిండిన కథ వినిపించినట్లు తెలిసింది. అది శర్వాకు బాగా నచ్చడంతో సినిమాకి పచ్చజెండా ఊపారని సమాచారం. అయితే దీన్ని ఎవరు నిర్మిస్తారన్నది తేలాల్సి ఉంది. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.


‘భీష్మ’ దర్శకుడితో..

నితిన్‌ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అలాగే సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కాగా, ఇప్పుడాయన మరో దర్శకుడికి ఓకే చెప్పినట్లు తెలిసింది. ‘భీష్మ’ చిత్రంతో నితిన్‌కు విజయాన్ని అందించారు దర్శకుడు వెంకీ కుడుముల. ఈ కలయికలోనే ఇప్పుడు మరో సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. స్క్రిప్ట్‌ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌కు నితిన్‌ ఓకే చెప్పారని తెలిసింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని