Maa Oori Polimera 2: ఓటీటీలోకి ‘పొలిమేర 2’.. వారికి 24 గంటల ముందే స్ట్రీమింగ్‌

సత్యం రాజేశ్‌, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మా ఊరి పొలిమేర 2’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఏ ఓటీటీలో, ఎప్పుడు స్ట్రీమింగ్‌ అంటే..?

Published : 01 Dec 2023 17:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత నెలలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులకు థ్రిల్‌ పంచిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2). ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ (Maa Oori Polimera 2 OTT Release Date) తాజాగా ఖరారైంది. డిసెంబరు 8 నుంచి తెలుగు ఓటీటీ ‘ఆహా’లో (Maa Oori Polimera 2 on Aha) స్ట్రీమింగ్‌ కానుంది. సోషల్‌ మీడియా వేదికగా సదరు సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. ‘ఆహా గోల్డ్‌’ చందాదారులకు 24 గంటల ముందే సినిమాని చూసే అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆ చందాదారులకు డిసెంబరు 7నే సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది.

ఓటీటీలోకి ‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

విజయవంతమైన ‘మా ఊరి పొలిమేర’కు ఈ సినిమా సీక్వెల్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. తొలి భాగం నేరుగా ఓటీటీ (డిస్నీ+హాట్‌స్టార్‌)లో విడుదల చేయగా రెండో భాగాన్ని థియేటర్లలో విడుదల చేసి కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేశారు. చేతబడి ఇతివృత్తంగా ఈ రెండు సినిమాలను డాక్టర్‌ విశ్వనాథ్‌ తెరకెక్కించారు. సత్యం రాజేశ్‌, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను ప్రధాన పాత్రలు పోషించి మెప్పిచారు.

పొలిమేర 2 కథేంటంటే..

జంగయ్య (బాలాదిత్య) తన అన్న కొమిరి అలియాస్‌ కొమురయ్య (సత్యం రాజేష్‌).. కవిత (రమ్య)ను చేతబడి చేసి చంపాడని నిజం తెలుసుకున్నట్లు ‘పొలిమేర’ తొలి భాగంలో చూపించారు. అలాగే చనిపోయిందనుకున్న కవిత.. ఆమె చితిలో పడి కాలిపోయాడనుకున్న కొమిరి బతికే ఉన్నట్లు.. వాళ్లు కేరళలో కలిసి జీవిస్తున్నట్లు క్లైమాక్స్‌లో చూపించి ఆసక్తిరేకెత్తించారు. ఈ ‘పొలిమేర-2’ కథ అక్కడి నుంచే మొదలవుతుంది. జాస్తిపల్లి పోలీస్‌స్టేషన్‌కు కొత్తగా వచ్చిన ఎస్సై రవీంద్ర నాయక్‌ (రాకేందు మౌళి) కొమిరి కేసును తిరిగి ఓపెన్‌ చేస్తాడు. తన అన్నను చేతబడి నెపంతో హత్య చేశారని కేసు వేసిన జంగయ్య ఆఖరి నిమిషంలో కేసు ఎందుకు వాపసు తీసుకున్నాడు?ఆ తర్వాత నుంచి తనెందుకు కనిపించకుండా పోయాడు? అన్నది ఇన్వెస్టిగేట్‌ చేయడం మొదలు పెడతాడు.  ఈ క్రమంలో అతనికి జాస్తిపల్లి ఊరి పొలిమేరలో ఉన్న ఏకపాదమూర్తి గుడికి.. కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడికి.. కొమిరి చేసే క్షుద్రపూజలకూ ఓ లింక్‌ ఉందని కనిపెడతాడు. అలాగే కొమిరి తన స్నేహితుడు బలిజ (గెటప్‌ శ్రీను) భార్యను కేరళ తీసుకెళ్లినట్లు గుర్తిస్తాడు. మరి కొమిరితో వెళ్లిన కవిత ఏమైంది? అతని వెంట బలిజ భార్య వెళ్లడానికి కారణమేంటి? అసలు కొమిరి చేసే క్షుద్రపూజలకు జాస్తిపల్లి పొలిమేరలో ఉన్న గుడికీ.. అనంత పద్మనాభ స్వామి ఆలయానికీ ఉన్న సంబంధం ఏంటి? కొమిరి చేతబడులు చేసి మనుషుల్ని చంపుతున్నాడని తెలుసుకున్న అతని భార్య లక్ష్మి (కామాక్షి భాస్కర్ల) ఏం చేసింది? తన అన్నను వెతికి పట్టుకునేందుకు వెళ్లిన జంగయ్య ఏమయ్యాడు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని