Tollywood: కథలే ఫలితాల్ని నిర్దేశిస్తాయి ఎప్పుడైనా!

‘‘పంపిణీదారుగా కంటే... నిర్మాతగానే ప్రయాణం బాగుంది. నచ్చిన కథలతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాణంలో ఉంటుంది’’ అన్నారు రాజేష్‌ దండా. హాస్య మూవీస్‌ పతాకంపై వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారాయన.

Updated : 19 Mar 2023 07:11 IST

‘‘పంపిణీదారుగా కంటే... నిర్మాతగానే ప్రయాణం బాగుంది. నచ్చిన కథలతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాణంలో ఉంటుంది’’ అన్నారు రాజేష్‌ దండా (Rajesh Danda). హాస్య మూవీస్‌ పతాకంపై వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారాయన. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ తర్వాత ఆయన ‘ఊరు పేరు భైరవకోన’, ‘సామజవరగమనా’ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్‌, శ్రీవిష్ణులతో మరో రెండు సినిమాల్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సందర్భంగా రాజేష్‌ దండా శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘నా ప్రయాణం ‘స్వామిరారా’ సినిమాతో పంపిణీదారుగా మొదలైంది. సుమారు 82 చిత్రాల్ని పంపిణీ చేశా. పోస్టర్‌, టీజర్‌ని చూసి సినిమాలు విడుదల చేస్తుంటాం. అదొక విభిన్నమైన ఆట. ఆచితూచి ప్రయాణం చేస్తూ ఎక్కువ విజయాల్నే అందుకున్నా. ‘కేరాప్‌ సూర్య’, ‘ఒక్క క్షణం’, ‘నాంది’ తదితర చిత్రాలకి సహనిర్మాగా పనిచేశా. సందీప్‌కిషన్‌, వి.ఐ.ఆనంద్‌, అనిల్‌ సుంకరలతో నాకు మంచి అనుబంధం ఉంది. వాళ్ల ప్రోత్సాహంతోనే నిర్మాణంలోకి అడుగుపెట్టా. మా సంస్థ నుంచి మొదట ‘ఊరు పేరు భైరవకోన’ మొదలైంది. కానీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ముందు విడుదలైంది. మా తొలి చిత్రం సూపర్‌ నేచురల్‌ ఫాంటసీ సినిమా. విజువల్‌ ఎఫెక్ట్స్‌ చాలా ప్రాధాన్యం ఉంది. దానికి సంబంధించిన పనులవల్లే సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. కథ అనుకున్నప్పుడే మంచి వాణిజ్య సినిమా అవుతుందని భావించాం. ఆగస్టులో విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఫలితం వాణిజ్య పరంగా సంతృప్తినివ్వకపోయినా మంచి సినిమా తీశారనే పేరొచ్చింది. ఓటీటీలో ఆ సినిమా విజయం సాధించింది’’.

*  ‘‘కరోనాకి ముందు ఆ తర్వాత అంటూ వేరు చేసి చూస్తారు కానీ... ఎప్పుడైనా కథలపైనే సినిమా ఫలితాలు ఆధారపడతాయి. కథ బాగుంటే... దాన్ని ప్రేక్షకులకి నచ్చేలా తీస్తే తప్పకుండా విజయం సాధ్యం. నిర్మాతగా ప్రయాణంపై సంతృప్తిగా ఉన్నా. కథ కోరుకున్నట్టుగా సినిమా తీయడమే ముఖ్యమని నమ్ముతా. అందుకే ఖర్చు ఎక్కువైనా రాజీపడకుండా సినిమాల్ని నిర్మిస్తున్నాం. శ్రీవిష్ణు కథానాయకుడిగా మేం  నిర్మించిన ‘సామజవరగమన’ ఈ వేసవిలో విడులదవుతుంది. అదొక పూర్తిస్థాయి కుటుంబ వినోద చిత్రం. తదుపరి అల్లరి నరేష్‌ కథానాయకుడిగా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ఫేం సుబ్బు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాం శ్రీవిష్ణుతో  ఓ చిత్రం. సాయిధరమ్‌ తేజ్‌ నాకు ఇష్టమైన హీరో. ఆయనతోనూ, ‘నాంది’ కలయికలో ఓ సినిమాని చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని