
జేడీయూకు ఎల్జేపీ గండి..!
నీతీశ్ను ఇరకాటంలో పెట్టిన చిరాగ్
పుంజుకున్న భాజపా
ఇంటర్నెట్డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీయే మరోసారి విజయం దిశగా దూసుకెళుతోంది. ఎన్డీయే కూటమిలోని భారతీయ జనతా పార్టీ (భాజపా) అనూహ్యంగా పుంజుకోగా.. అదే సమయంలో గతం కంటే జేడీయూ మరిన్ని సీట్లు కోల్పోయింది. ఎన్డీయే నుంచి బయటకొచ్చి స్వతంత్రంగా పోటీ చేసిన ఎల్జేపీ.. జేడీయూ ఓట్లను చీల్చడం ఇందుకు కారణమని తెలుస్తోంది. జేడీయూ అభ్యర్థులు నిలుచున్న చోట ఆ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టింది. అంతిమంగా పలు నియోజకవర్గాల్లో జేడీయూ గెలుపుపై ప్రభావం చూపింది.
బిహార్ ఎన్నికల్లో 243 స్థానాలకు గానూ జేడీయూ 122, భాజపా 121 స్థానాలు పంచుకున్నాయి. తనకు కేటాయించిన 122 సీట్లలోంచి ఏడు సీట్లను జితన్రాం మాంఝీ పార్టీ (హెచ్ఏఎం)కు ఇచ్చింది. భాజపా సైతం వికాశ్ శీల్ ఇన్షాల్ పార్టీ (వీఐపి)కి 13 స్థానాలు కేటాయించింది. జేడీయూ 115, భాజపా 110 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. సీట్ల పంపకానికి కొద్ది రోజుల ముందు నీతీశ్ను వ్యతిరేకిస్తూ చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ ఎన్డీయే నుంచి బయటకొచ్చింది. అదే సమయంలో భాజపాతో తమ బంధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. జేడీయూ అభ్యర్థులు నిల్చున్న చోట అభ్యర్థులను నిలబెట్టింది. మొత్తంగా 135 సీట్లలో పోటీ చేసింది. ఫలితాల్లో జేడీయూకు 15+ శాతం ఓట్లు రాగా.. భాజపాకు దాదాపు 19+ శాతం ఓట్లు వచ్చాయి. ఎల్జేపీ 5.7 శాతం ఓట్లు సాధించింది. ఒకవేళ చిరాగ్ ఎన్డీయేతో కలిసి పోటీ చేసి ఉంటే జేడీయూకు ఈ పరిస్థితి ఏర్పడేది కాదు.
ఎన్డీయే నుంచి జేడీయూ బయటకు రావడానికి చిరాగ్ చెప్పిన కారణలేవీ సహేతుకంగా అనిపించవు. నీతీశ్ అవినీతికి పాల్పడ్డారని, ఆయన బిహార్కు ఏమీ చేయలేదని విమర్శిస్తూ వచ్చారు. తమకు చెక్ పెట్టేందుకే (దళిత ఓట్ల చీలికకు) జితన్రాం మాంఝీని కూటమిలోకి తీసుకొచ్చారని నీతీశ్ను తప్పుబట్టారు. ఈ కారణాలతో స్వతంత్రంగా పోటీ చేశారు. కానీ ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్న భాజపాను ఆయన ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు. దీంతో ఎల్జేపీని భాజపానే ఒంటరిగా పోటీ చేయించిందన్న ఆరోపణలు వచ్చాయి. జేడీయూ సీట్లను భారీగా చీల్చడం ద్వారా ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావించినట్లు తెలుస్తోంది. ఎల్జేపీ బయటకొచ్చిన తొలినాళ్లలో భాజపా సైతం చిరాగ్ను పెద్దగా విమర్శించిన దాఖల్లాలేకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. అయితే ఈ వ్యూహం వల్ల మహాకూటమి బలపడే అవకాశం ఉందన్న అంచనాకొచ్చిన కాషాయ పార్టీ ఎల్జేపీతో తమకు ఎలాంటి బంధం లేదని కొన్నాళ్లకు ప్రకటించింది. నిన్న మొన్నటి వరకు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఓ పార్టీ అధికార పార్టీపై ఆరోపణలు చేయడం జేడీయూకు నష్టం చేసింది. అంతిమంగా ఆ పార్టీ సీట్లు కోసుకుపోయేలా చేసింది. చెరి సగం స్థానాల్లో భాజపా, జేడీయూ పోటీ చేయగా.. 75, 40 స్థానాల్లో (తుది ఫలితాలు మారొచ్చు) విజయం దిశగా దూసుకెళుతున్నాయి. దీంతో రెండు పార్టీల మధ్య అంతరం దాదాపు 25 సీట్ల వరకు ఉండడంతో నీతీశ్కు సీఎం పీఠం ఇచ్చే విషయంలో భాజపా వెనుకడుగు వేసే సూచనలు కనిపిస్తున్నాయి.